బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్..


హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేతగా యువ కథానాయకుడు అభిజీత్‌ నిలిచాడు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం సినీ తారల సందడి మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సీజన్‌-4 విజేత అభిజీత్‌కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని అందించారు. ఈ సీజన్‌లో ఫైనలిస్ట్‌లుగా అఖిల్‌, అభిజీత్‌, సోహైల్‌, అరియానా, హారిక నిలవగా.. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు గట్టిపోటీ ఇచ్చారు.

ఫైనలిస్ట్‌లుగా నిలిచిన వారిలో నుంచి హారిక మొదట బయటకు రాగా, ఆ తర్వాత అరియానా, సోహైల్‌ బయటకు వచ్చారు. ఆ తర్వాత అభిజీత్‌-అఖిల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో విజేతగా ఎవరు నిలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న అభిజీత్‌ను విజేతగా ప్రకటించారు. హౌస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి తోటి హౌస్‌ మేట్స్‌తో కలిసిపోయి ఉండటం, బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లను మైండ్‌ గేమ్‌తో ఆడడం వంటివి అభిజీత్‌కు అభిమానులను పెంచడమే కాకుండా విజేతగానూ నిలబెట్టాయి.

*స్మార్ట్‌ గేమ్‌ ఆడిన సొహైల్‌*

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రాండ్‌ ఫినాలే రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఒకటి చోటుచేసుకుంది. టాప్‌-5 నుంచి హారిక, అరియానా వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో మిగిలిన అభిజీత్‌, అఖిల్‌, సొహైల్‌కు నాగార్జున ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఎవరైతే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వస్తారో వారికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నాగార్జున ఇచ్చిన ఆఫర్‌కు సోహైల్‌ ఓకే చెప్పాడు. అందులో రూ.5 లక్షలు మెహబూబ్‌కు, రూ.10 లక్షలను అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన మెహబూబ్‌ తనకిస్తానన్న రూ.5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో నాగార్జున ఇంకో ఆఫర్‌ ఇచ్చాడు. అనాథ శరణాలయానికి రూ.10 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తానని చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు అరియానాకు రూ.10లక్షలు ఆఫర్‌ చేసినా ఆమె తిరస్కరించింది. చివరి వరకూ పోటీలో ఉండేందుకే మొగ్గు చూపింది. గత మూడు సీజన్ల ఫినాలేలో ఇలాంటి ఆపర్‌ ఇచ్చినా ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. మరోవైపు మెహబూబ్‌ రూ.5లక్షలు అనాథ శరణాలయానికి ఇస్తాడని నాగార్జున.. చిరంజీవికి చెప్పడంతో స్పందించిన చిరంజీవి వెంటనే మెహబూబ్‌కు రూ.10 లక్షల చెక్కును వేదికపైనే అందించారు.

*బిగ్‌బాస్‌ సీజన్‌-4 హైలైట్స్‌*

* సెప్టెంబరు 6న మొదలైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ 105 రోజుల పాటు నిర్విరామంగా సాగింది.

* కరోనా నేపథ్యంలో ఈసారి హౌస్‌లోకి వెళ్లేవారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కరోనా టెస్టు చేసి, క్వారంటైన్‌ తర్వాతే హౌస్‌లోకి పంపారు.

* సూర్య కిరణ్‌, కల్యాణి, దేవి, స్వాతి, గంగవ్వ, సుజాత, దివి, నోయల్‌, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, లాస్య, అవినాష్‌, మోనల్‌, హారిక, అరియానా, సోహైల్‌, అఖిల్‌, అభిజీత్‌ మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొన్నారు.

* వీరిలో కుమార్‌ సాయి, అవినాశ్‌, స్వాతి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లారు.

* గంగవ్వ, నోయల్‌లు అనారోగ్యం కారణంగా సీజన్‌ మధ్యలోనే హౌస్‌ విడిచి వెళ్లిపోయారు.

* దసరా పండుగ సందర్భంగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

* 62వ రోజున తమిళ బిగ్‌బాస్ హౌస్‌ మేట్స్‌తో పాటు, వ్యాఖ్యాత కమల్‌ హాసన్‌‌ తెలుగు బిగ్‌బాస్‌ షోలోని వారితో వర్చువల్‌గా మాట్లాడారు.

* 100వ రోజు స్పెషల్‌గా హరితేజ (సీజన్‌-1), గీతా మాధురి (సీజన్‌-2), శ్రీముఖి (సీజన్‌-3) అలీ రెజా (సీజన్‌-3)లో పాల్గొన్న వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

About The Author