కేసీఆర్‌ నూతన సంవత్సర కానుకను కమర్షియల్‌ వాహనాలకు ఆరు నెలల వాహన పన్నును రద్దు

తెలంగాణలో వాహనదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. కమర్షియల్‌ వాహనాలకు ఆరు నెలల వాహన పన్నును రద్దుచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో మే నెలలో లాక్‌డౌన్‌ను సడలించినా రవాణా వ్యవస్థ గాడిలోపడలేదు. దీంతో ప్రైవేటు ట్యాక్సీలు, సరుకు రవాణా వాహనాల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా చతికిలాపడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని, వాహన పన్నును రద్దు చేయాలని ట్రాన్స్‌పోర్టు వాహనదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఆరు నెలల వాహన పన్ను రూ.267 కోట్లు రద్దు చేస్తున్నట్టు గత నవంబర్‌లో ప్రకటించారు. దీనికి సంబంధించిన జీవోను గురువారం విడుదలచేశారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 8,37,811 వాహనదారులకు లబ్ధి చేకూరనుంది. పన్ను మాఫీపై ట్రాన్స్‌పోర్టు వాహనాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ ఆర్థిక భారాన్ని తగ్గించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ నిర్ణయంతో మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు రెండు త్రైమాసికాల వాహన పన్ను రద్దయింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లో బస్సులు, లారీలు, క్యాబ్స్‌ తదితర సుమారు 1.35 లక్షల వాణిజ్య వాహనాలకు లబ్ధి చేకూరనుంది. వాహన కేటగిరీని బట్టి ట్యాక్స్‌ లెక్కకడతారు. హైదరాబాద్‌లో రెండు త్రైమాసికాల పన్ను రూ. 40 కోట్లు, రంగారెడ్డిలో సుమారు రూ. 50 కోట్లు, మేడ్చల్‌లో రూ. 45 కోట్ల వరకు పన్ను మాఫీ అయింది.

About The Author