పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని చంపేసిన ప్రియురాలు


కొవ్వూరు పట్టణం: పెళ్లికి నిరాకరించాడన్న ఆక్రోశం.. వేరొకరిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో ప్రియుడిని ఓ యువతి హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ ఎం.సురేష్‌ కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దీంతో కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు చూసి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author