మూఢ నమ్మకంతో ఇద్దరు కూతుళ్లను బలి ఇచ్చిన తల్లి.


మూఢనమ్మకాలు, ఆపై పరాకాష్టకు చేరిన పరమభక్తికి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు బిడ్డలను బలిచ్చింది ఆ తల్లి. ఇది తండ్రి ముందే జరిగిన ఘోరం. మూడురోజులుగా ఇంటిలో పూజలు చేస్తూ, దానిలోభాగంగా ఇద్దరు పిల్లలను పూజలకు బలిచేసిన ఉదంతమిది. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివాలయంవీధికి చెందిన మల్లూరు పురుషోత్తంనాయుడు, పద్మజ భార్యాభర్తలు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెద్దకుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే రాజీనామా చేశారు. కరోనా నేపథ్యంలో ఇంటివద్దే ఉంటూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. రెండో అమ్మాయి సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్‌ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు.
వీరి తండ్రి పురుషోత్తంనాయుడు స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌. తల్లి పద్మజ గణితంలో గోల్డ్‌మెడలిస్టు. మదనపల్లెలోనే ఓ ప్రముఖ పాఠశాలను నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. సాయిబాబా, శివుడు వీరి కుటుంబ ఆరాధ్య దైవాలు. కరోనా వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి రావడంతో పూజలు పెంచేశారు. ఈక్రమంలో మూడురోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపి లేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం తల్లితోసహా ఇద్దరు పిల్లలు నగ్నంగా పూజలు చేశారు. ఈక్రమంలో పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోదీ చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసింది. చంపే ముందే.. ఇద్దరు బిడ్డలను ఇంటిచుట్టూ తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.

About The Author