వేయి స్తంభాల వేదన తీరేదెప్పుడు ??


16 ఏళ్లయినా పూర్తికాని వైనం ……
ఆ కళ్యాణ మంటపం :
కాకతీయ శిల్పులు సృష్టించిన అద్భుతం..
కాకతీయ కళా వైభవ ప్రతీక..
రుద్రమతో సహా ఎందరో పాలకులు విశ్రమించిన
కోవెల..
అబ్బురపరిచే శిల్పసంపదను ఒక్కసారైనా చూడాలని దేశ, విదేశాల టూరిస్టులు ఉవ్విళ్లూరే కట్టడం .
వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించి ఓరుగల్లుకు వస్తారు. తీరా ఇక్కడికొస్తే రుద్రుడొక్కడే దర్శనమిస్తాడు.. వేయి స్తంభాలు కన్పించవు అసంపూర్ణంగా ఉన్న కల్యాణ మండపం, అక్కడక్కడ పడేసిన రాతి శిల్పాలను చూసి మనసు చివుక్కుమంటుంది.
పునర్నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడిగిన ప్రతీ సారి ఆరు నెలల్లో పూర్తి చేస్తామనే మాటలు తప్ప అడుగు ముందుకు పడట్లేదు.

కాకతీయుల శిల్పకళకు అద్దంపట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగు…………తూనే ఉన్నాయి.
ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కారణంగా పునరుద్ధరణ పనులు మధ్యలో ఆగిపోయాయి.
నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా పేరొందింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా జీవకళ ఉట్టిపడే భారీ నంది విగ్రహం.. దాని వెనుక అద్భుతమైన కల్యాణ మంటపం ఉండేది.

పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచింది. 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్ని ర్మించాలని నిర్ణయించింది. నాటి కాకతీయుల నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించి ఇందుకోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది.

పదహారేళ్లు గడిచినా..
కల్యాణ మంటపం పున:నిర్మాణ పనులు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మంటపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత రెండున్నరేళ్ల పాటు పనులు సాగలేదు. ఎట్టకేలకు 25-02-2010న మళ్లీ పనులు మొదల య్యాయి. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు.
దీనిపై ఏడు వరుసలు రాతి నిర్మాణంతో మొదలయ్యే ప్రదక్షిణ పథం నిర్మించారు. అనంతరం నాలుగు వరసలు ఉండే కక్షాసనం నిర్మించారు. ఆపై రాతిగోడ నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణంలో ఉన్న శిలలను పట్టి ఉంచేలా ముఖ్యమైన శిలలకు స్టెయిన్‌లెస్ స్టీల్ పట్టీలను అమర్చారు. గతంలో కాకతీయులు కరిగించిన ఇనుమును పోసిన పోతల్లోనే ఈ స్టెయిన్‌లెస్ స్టీలు పట్టీలు అమర్చారు.
కిందామీదా పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యాయి.
కానీ, మరోసారి నిధుల కొరత ఏర్పడటంతో గడిచిన మూడు సంవత్సరాలుగా పనులు నిలిచిపోయాయి.

అసమర్ధ పాలకుల చేతిలో ఆగమైతున్న జాతి సంపద……….!!!

#Kakatiya
#Warangal

About The Author