Warning: Constant WP_CACHE already defined in /home/teluskbp/public_html/9staartv.com/wp/wp-config.php on line 87
ఈటల భూములపై కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదు.. - 9Staar TV

ఈటల భూములపై కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదు..


ఈటల భూ కుంభకోణంలో వ్యవహరించిన తీరు సరిగా లేదని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరపడం, ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పించడం చట్టం ప్రకారం, సక్రమమైన తీరులో జరగలేదని, అందువల్ల అది చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని నిబంధనల ప్రకారం వ్యవహరించి మళ్ళీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నియమం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారికి నోటీసులు జారీ చేయాలని, ఆ తర్వాతనే విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు జరిగిన వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మే నెల 1, 2 తేదీల్లో జరిగిన విచారణను, కలెక్టర్ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈటల భూముల్లో సర్వే జరపడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. జమున హేచరీస్, వ్యాపారం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని, బలవంతపు చర్యలు వద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ మూడు రోజుల్లో సహజ న్యాయసూత్రాలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.

సరైన పద్ధతిలో నోటీసులను ఇచ్చి విచారణ జరపాలని ప్రభుత్వానికి సూచించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం తగిన సమయం ఇవ్వాలని పేర్కొంది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని నొక్కిచెప్పింది. రాచమార్గంలో వెళ్లాలని, బ్యాక్ గేట్ నుంచి కాదు అని సర్కారుకు సూచించింది. సెక్షన్ 149, 151 ప్రకారం ఎంక్వైరీకి వచ్చినప్పుడు సదరు కంపెనీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతి లేకుండానే కలెక్టర్ ఆ భూముల్లోకి వెళ్ళారని న్యాయవాది లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. భవిష్యత్తులో ఇంకెవరైనా ఏ ఇంట్లోకైనా ప్రవేశించవచ్చు అనేదానికి ఆస్కారం ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 1వ తేదీ మధ్యలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, దర్యాప్తు అనంతరం నివేదిక సమర్పించడం పూర్తయిందని హైకోర్టుకు వివరించారు. ఆ సమయంలో అక్కడ జమున హేచరీస్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే బెంచ్ జోక్యం చేసుకుని, ఎన్ని గంటల్లో నివేదిక ఇచ్చారు, విచారణ సమయంలో పిటిషనర్ నుంచి వివరణ తీసుకున్నారా, విచారణకు ముందు నోటీసులు జారీ చేశారా, చేయకుండానే నేరుగా అధికారులు ఎలా వెళ్తారు.. అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది..l

About The Author