అత్యవసర ప్రయాణీకులకు ఈ-పాస్ హద్దు మీరితే వాహనాలు జప్తే


ఏపీలో కోవిడ్ కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ హెచ్చరించారు. ఆదివారం విజయవాడలో పలు చోట్ల కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అందరూ రెండు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

అత్యవసర ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ఈ-పాస్‌ విధానం అమలు చేస్తామని..

ఇందుకోసం ఈ-పాస్‌ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని సవాంగ్ సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు.

శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం తెలిపిన అధికారుల వద్ద ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గౌతం సవాంగ్ సూచించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని.. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి వాటిపై డయల్‌ 100, 112 నెంబర్లకు సమాచారం అందించాలని డీజీపీ వెల్లడించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్రత నేపథ్యంలో పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నారు. ఈ నెల 18 వరకు పగటి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు.

About The Author