వైఎస్సార్‌‌ను విమర్శిస్తే మర్యాద దక్కదు.. తెలంగాణ మంత్రులకు రోజా వార్నింగ్..


తెలుగు రాష్ట్రాల జల వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల మంత్రులు,అధికార పార్టీ నేతలు ఘాటైన విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ప్రత్యర్థులు మాత్రం ఇదంతా డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ వివాదంపై స్పందించారు. వివాదంలోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లాగడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌ను విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని రోజా హెచ్చరించారు. కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం ఆంధ్రాకు అన్యాయం చేయడమేనని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ,కేంద్ర జలవననరుల శాఖ మంత్రి షెకావత్‌కు లేఖలు రాశారని చెప్పారు.
శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి దక్కాల్సిన నీటిని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం,పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల దొంగ అయితే.. నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి గజదొంగ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ నరరూప రాక్షసుడని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలంగాణ నేతలకు కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు,ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్‌కు వేర్వేరు లేఖలు రాశారు.జల వివాదంపై తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ… తెలంగాణ అక్రమంగా వాడుకుంటోందని లేఖలో ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలుపదల చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోరారు. వ్యవసాయ అవసరాలు లేకపోయినా అక్రమంగా నీటిని వాడుకుంటూ.. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ చర్యలతో రాయలసీమ,నెల్లూరు,ప్రకాశం ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

About The Author