గుంటూరులో రమ్య హత్యకు సంబంధించి గుంటూరు ఇంచార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు

గుంటూరులో రమ్య హత్యకు సంబంధించి గుంటూరు ఇంచార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో పరిచయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని, నిందితుడు శశికృష్ణ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. శశికృష్ణ ఇన్‌స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని వెల్లడించారు. శశికృష్ణ వేధించడంతోనే రమ్య దూరం పెట్టిందని.. ప్రేమించకపోతే చంపుతానంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని ఇంచార్జ్‌ డీఐజీ పేర్కొన్నారు. ప్రేమించలేదన్న కోపంతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని చెప్పారు.

నిందుడికి చికిత్స అందించామని.. నేడు రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్‌మీడియా పరిచయాలపై సమాజం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. డీజీపీ ఆదేశాల మేరకు యువతులు, మహిళలు సోషల్ మీడియా ఉచ్చులో పడకుండా క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొన్ని నేరాలను పోలీస్‌శాఖ నివారించలేదన్న ఇంచార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు.. సమాజమే స్పందించి అడ్డుకోవాలి కోరారు. నిందితులను గంటల వ్యవధిలో పట్టుకోవడంలో తెగువ చూసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

పట్టపగలే నడిరోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్‌ విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరువద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి ఏపీ సర్కార్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షలు పడేలా చూడాలని సీఎం జగన్ పోలీసు అధికారులను ఆదేశించారు.

About The Author