చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో


చిరుత దాడి ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో
కాలినడక భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు
అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి శుక్రవారం మరోమారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాడి చేసింది పిల్లచిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని ఈవో చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ శ్రీ సతీష్, టీటీడీ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author