మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
జపాన్లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కెరీర్లో తొలి సూపర్-750 టైటిల్ను సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సుదీర్ఘ విరామానంతరం టైటిల్ సాధించింది. ఈ తెలుగు తేజం జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-17, 21-17తో వరల్డ్ నెంబర్. 3 అకానె యమగూచి (జపాన్)కి షాకిచ్చింది. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డుకెక్కింది. అంతేకాదు.. 2024 డిసెంబరులో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గకపోవడంతో ఆమె పనైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ గెలుపుతో సింధు దీటైన సమాధానం ఇచ్చింది.
అజేయంగా: ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క గేమ్ను కూడా కోల్పోకుండా సింధు టైటిల్ను సాధించడం విశేషం. ఫైనల్లో స్థానిక షట్లర్ యమగూచికి అభిమానుల నుంచి లభిస్తున్న మద్దతును ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకాగత్రతో ప్రశాంతంగా ఆడుతూ పాయింట్లతోనే బదులిచ్చింది. యమగూచి బలమైన స్మాష్లకు సింధు తన ట్రేడ్మార్క్ క్రాస్ కోర్టు షాట్లతో జవాబిచ్చింది. 2022 సింగపూర్ ఓపెన్ తర్వాత విదేశీ గడ్డపై సింధు సాధించిన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ ఇదే.
