రివాల్వర్ తో భర్తపైనే కాల్పులు ..


రివాల్వర్ తో భర్తపైనే కాల్పులు ..
తన అక్రమ సంబంధాన్ని అడిగినందుకు ..

రైల్వే భద్రతా దళంలో(ఆర్‌పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా అధికారి తన భర్తపై సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్పులకు తెగబడింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన సునీతా మింజ్‌కి, రైల్వేలోనే ఉద్యోగం చేస్తున్న దీపక్‌ శ్రీవాత్సవతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వేరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందంటూ మింజ్‌తో శ్రీవాత్సవ తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. వారు నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భటపారా రైల్వేస్టేషన్లో మింజ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం ఆమె పనిచేస్తున్న రైల్వేస్టేషన్‌కి వచ్చిన శ్రీవాత్సవ ఆమెతో గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. వెంటనే మింజ్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌ను బయటకు తీసి గాలిలోకి ఒక రౌండు కాల్పులు జరిపి శ్రీవాత్సవను హెచ్చరించింది. అయినా ఫలితం లేకపోవడంతో నేరుగా శ్రీవాత్సవ పైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. తీవ్రగాయాలపాలైన అతణ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సిఫారసు మేరకు రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. మింజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About The Author