ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం.. ఆర్థికశాఖ ప్రకటన…


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో గురువారం జీతం జమ కాలేదు. దీంతో ఉద్యోగులంతా ఆర్థికశాఖను సంప్రదించారు. దీనిపై తాజాగా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఒకటో తేదీన జీతాలు చెల్లించలేకపోవడానికి నిధుల కొరత కారణం కాదని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుభేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని వివరించింది.
అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల దస్త్రాలు యధాప్రకారం జూలై 31నే ఆర్బీఐకి పంపామని ఏపీ ఆర్థిక శాఖ తెలిపింది. ఒకటో తేదీ మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొంతమంది జీతాల చెల్లింపులు జరిగాయని వివరించింది.అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ- ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన దస్త్రాల చెల్లింపు ఆలస్యమైనట్లు ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి.. మిగిలిన జీతాల చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోగా చెల్లింపులు చేస్తామని వెల్లడించింది. మరోవైపు నిధుల కొరత వల్లే జీతాల చెల్లింపులు ఆలస్యమైందని ఉద్యోగులు ఆందోళ చెందుతున్నారు.

About The Author