పట్ట పగలే ఎర్ర చందనం అక్రమ రవాణా : వాహనం సహా స్థానిక స్మగ్లర్ అరెస్టు

తిరుపతి: స్థానికంగా ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లు పై టాస్క్ ఫోర్స్ దృష్టి సారించింది. తిరుపతి జీవకోనకు చెందిన ఒకరిని బుధవారం అదుపులోకి తీసుకుంది.‌ పట్ట పగలే ఎర్ర చందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఈ ప్రాంతంలో మాటు వేసింది. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ పి రవిశంకర్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనలతో ఆర్ ఎస్ ఐ వాసు బృందం కరకంబాడి బీట్ ప్రాంతంలో పగటి సమయంలో కూంబింగ్ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాత్రి సమయాల్లోనే కూంబింగ్ చేస్తారని భావించిన జీవకోన కు చెందిన ఎస్ కె సిద్ధు (29) తన సహచరులతో కలిసి ఎర్ర చందనం అక్రమ రవాణా కు ప్రయత్నించాడు. అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో హరితా కాలనీ వద్ద పార్కింగ్ చేసి ఎర్ర దుంగలను లోడ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్ ఒ పివి నరసింహారావు బృందం వారిపై దాడి చేసింది. వీరికి సిద్దు పట్టు బడగా మిగిలిన వారు తప్పించు కున్నారు. వారికోసం కూంబింగ్ కొనసాగుతోంది. వీరినుంచి నాలుగు ఎర్ర చందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  జీవకోన ప్రాంతంలో ఇతర స్మగ్లర్లు గురించి విచారణ చేపట్టారు

About The Author