శ్రీకార్తీక పురాణము 23వ అధ్యాయము


శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట
అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ” ఓ మునిపుంగవా! విజయంపొందిన పురంజయుడను యేమిచేసెనో వివరింపుము ” అని కోరెను. అప్పుడు అత్రిమహాముని ” కుంభసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభవమున అసమాన బలోపేతుడై, అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రు రాజులనందరిని ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును యేలుచుండెను. తనయొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షతత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదవేదాంగవేత్తయై యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండకీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణుసేవధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై యుండెను. ఇన్నియేల? అతడిప్పుడు విష్ణుభక్తగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ నక్షత్రమున యే విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడనగుదునా? అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి ” పురంజయా! కావేరి తీరమున శ్రీరంగక్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు “. అని పలికెను.
అప్పుడు పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మర్గమధ్యముననున్న పుణ్యక్షేత్రలను దర్శిస్తూ, ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదులలో స్నానము చేస్తు, శ్రీరంగక్షేత్రముని చేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవ్వలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది చేతులు జోడించి
” దామోదరా! గోవిందా! గోపాల! హరీ! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకిందా! పురాణపురుషా! హృషీకేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా! కరివరదా! పాహిమాం! పాహిమాం! రక్షమాం! రక్షమాం! దాసోహం పరమాత్మా దాసోహం ”
అని విష్ణు స్తోత్రమును పఠింవి, కార్తీకమాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీకమాసంలో చేసిన వ్రతముల మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలచేతలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో వుండిరి.
అయోధ్యానగరము ధృడతరప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్బ నిర్భేదకులై ,నిరంతరం విజయశీరులై, అప్రమత్తులై వుండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంసగజగామినులూ, పద్మ పత్రాయతలోచనులూనై విపుల శ్రోణీత్వము, సూక్ష్మ మధ్యత్వము సింహకూచపీనత్వము కలిగి రూపవతిలనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగియుండిరి.
ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదులై, పౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై యుండిరి. ఆ పట్టనకులాంగనలు పతిశుశ్రూషా పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై యుండిరి.
పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాధ్యతుర్యధ్వనులతో ఎదురేగి నగరప్రదక్షిణ చేసి ణిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తు కొంతకాలానికి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని, తన కుమారునకు రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తునిచేసి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునకు పోయెను. అతడా వనప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగా కార్తీక వ్రతమాచరించు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించెను. కావున ఓ అగస్త్యా! కార్తీకవ్రతము ఆత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదువునప్పుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

23వ అధ్యాయము సమాప్తము

కార్తీకమాస 23వ రోజున ఆచరించవలసిన దానధర్మలు – జపతపాది విధులు – ఫలితములు

పూజించాల్సిన దైవము → అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము → ఓం శ్రీమాత్రే నమః అష్టమాతృకాయ స్వాహా
నిషిద్ధములు → ఉసిరి, తులసి
దానములు → మంగళ ద్రవ్యాలు
ఫలితము → మాతృరక్షణం, వశీకరణం

About The Author