వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హత్యాచార ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దిశను సజీవదహనం చేసిన చోటే నిందితులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్‌ నిర్ధారించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు.

ఎన్‌కౌంటర్అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్న కేశవులను చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా తరలించారు. తొలుత తొండపల్లి టోల్ సమీపంలోని ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం చేయాలనే ఆలోచన ఎవరిది? తదితర వివరాలను సేకరించారు.

అనంతరం అత్యాచారం జరిగిన ప్రదేశానికి సమీపంలో నిందితులు పాతపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే తీయించారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. అంతకు ముందు దిశ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన క్లూస్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. నిందితులను అరెస్ట్‌ చేసిన సమయంలోనే పలు ఆధారాల్ని సేకరించినా.. కోర్టులో నిరూపించేందుకు అవసరమైన కీలక ఆధారాల్ని మలివిడతలో క్లూస్‌ నిపుణులు సేకరించారు.

ఈక్రమంలో శంషాబాద్‌ తొండుపల్లి, షాద్‌నగర్‌ చటాన్‌పల్లిల్లోని సంఘటన స్థలాల్లో గురువారం క్షుణ్నంగా తనిఖీలు చేశారు. షాద్‌నగర్‌ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగలిగే ‘సూపర్‌లైట్‌’ పరికరాన్ని వినియోగించి ఆధారాల్ని సేకరించారు. నిందితుల ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు.

About The Author