TV9 ను బ్యాన్ చేయనున్న తెలుగుదేశం పార్టీ…??


యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 పూర్తిగా .. అసత్యాలు, అభూతకల్పనలు ప్రసారం చేస్తూ.. సాక్షి టీవీకి క్లోన్‌గా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సాక్షి టీవీలాగే.. ఆ చానల్‌ను కూడా పార్టీ పరంగా బహిష్కరించే ఆలోచనపై .. టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక యువనేత ఒకరు తెలుగు360కి ఈ సమాచారాన్ని ధృవీకరించారు. మీడియా అంటే.. అమితమైన ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ.. టీవీ9ను బహిష్కరించే ఆలోచన చేయడానికి ఇటీవలి కాలంలో.. ఆ చానల్ ఎడిటోరియల్ పాలసీని పూర్తిగా సాక్షి క్లోన్‌గా మారిపోవడమే కారణం అంటున్నారు.

వైసీపీ సర్కార్‌ను పొగుడుకుంటే తమకేం ఇబ్బంది లేదు కానీ.. తమపై కావాలని తప్పుడు వార్తలు.. ఫేక్ న్యూస్‌.. దుష్ప్రచారాలు చేస్తూ… మీడియా ముసుగులో కుట్ర చేస్తోందని.. టీడీపీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. ఏపీపై చులకనభావం చూపిస్తూ.. తమ వార్తాంశాల్లో.. ” వలస పాలకులు ” అనే పదాన్ని పదే పదే ప్రయోగిస్తోంది. అసలు వలస పాలకులు అనే పదం.. టీఆర్ఎస్ కు ప్రత్యేకం. ఆ పార్టీకి చెందిన మీడియా.. టీఆర్ఎస్ నేతలు మాత్రమే విమర్శలు చేస్తూంటారు. వలస పాలకులు అంటే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్యమంత్రులే. వారిని కించ పరచడం అంటే.. ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనని.. టీవీ9 .. అదే పని చేస్తోందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాను.. టీడీపీ బహిష్కరించింది. పార్టీ పరమైన కార్యక్రమాలకు ఆయా మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానించడం లేదు. ఇప్పుడు సాక్షి జాబితాలో టీవీ 9ని కూడా చేర్చాలనుకుంటున్నారు. ఇక టీడీపీకార్యక్రమాల కవరేజ్‌తో పాటు.. ఆ చానల్‌లో చర్చలకు కూడా.. పార్టీ తరపున ప్రతినిధులు వెళ్లకుండా చూసే అవకాశం ఉంది. టీవీ9 రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారికి రాజకీయ లక్ష్యాలు లేకపోయినా.. వారి వ్యాపార ప్రయోజనాలకు కొమ్ముకాసే రాజకీయ పార్టీల అవసరాలకు తగ్గట్లుగా ఫేక్‌ న్యూసో.. బయాస్ న్యూసో ప్రసారం చేయాల్సిన పరిస్థితికి టీవీ9 దిగజారిందని టీడీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీవీ9కి ప్రజల్లో ఉన్న క్రెడిబులిటీని పణంగా పెట్టి మరీ…పూర్తిగా టీడీపీని టార్గెట్ ఫేక్ న్యూస్ కూడా ప్రసారం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఐటీ దాడులు.. పార్టీ ఫిరాయింపులు వంటి వాటిలో టీవీ9 తప్పుడు వార్తలు ప్రచారం చేసిందని ఓ అభిప్రాయానికి వచ్చారు.

వైసీపీ ఇప్పటికే ఏబీఎన్, టీవీ5 చానళ్లను బహిష్కరించింది. ఈ రెండింటిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బహిష్కరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బహిష్కరణ ఫలాలు ఎలా ఉంటాయో.. వారికి చూపిస్తోంది. టీడీపీ కూడా… టీవీ9ను బహిష్కరిస్తే.. తన ఖాతాలో రెండు చానళ్లను.. చేర్చుకున్నట్లు అవుతుంది. తెలుగు మీడియా.. పార్టీల మధ్య.. దారుణంగా చీలిపోయిన వైనం.. ఇది కళ్లకు కట్టినట్లుగా చేస్తోంది.

About The Author