కరీంనగర్‌కు కరోనాను తెచ్చిన ఇండోనేసియన్స్ వీళ్లే.. 8 మందికి పాజిటివ్


తెలంగాణలో ఇండోనేసియన్లు తీవ్ర కలకలం రేపుతున్నారు. ఓ మత సంబంధ కార్యక్రమం కోసం వచ్చిన వీరంతా.. కరీంనగర్‌కు కరోనాను తీసుకొచ్చారు. మొత్తం 12 మంది ఇండోనేసియన్ల బృందంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరెవరిని కలిశారు? అనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. మార్చి 13న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి మార్చి 14న రామగుండంలో దిగారు. అక్కడ నుంచి వ్యాన్‌లో బయలుదేరి కరీంనగర్ చేరుకున్నారు. మార్చి 14న కలెక్టరేట్ సమీపంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందారు. మదర్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరి ప్రసంగాలను వినేందుకు సుమారు 150 మంది స్థానికులు వచ్చినట్లు సమాచారం. ‘ఇజ్తేమా’ అనే సంస్థ తరపున వీరంతా కరీంనగర్‌కు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. మార్చి 14న కరీంనగర్లోని స్థానిక మసీదులో ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. నిబంధనల ప్రకారం తాము ఇండోనేసియా నుంచి వచ్చామని.. కొద్ది రోజులు ఇక్కడే ఉంటామని తెలిపారు. ఐతే కరోనా నేపథ్యంలో మార్చి 15న వారందరి మెడికల్ సర్టిఫికెట్లను పోలీసులు అడిగారు. దాంతో స్థానిక ఆస్పత్రికి పరీక్షల కోసం వెళ్లగా.. వారిలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయి. అతడికి గాంధీ ఆస్పత్రిలో టెస్ట్‌లు చేయగా పాజిటివ్ వచ్చింది. అనుమానంతో మిగిలిన వారికీ పరీక్షలు చేయడంతో.. మరో ఏడుగురికి కరోనా సోకినట్లు తేలింది. మొత్తంగా 12 మంది బృందంలో 8 మందికి కరోనా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇండోనేసియన్స్ గ్రూప్ మార్చి 14న రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి.. ఆటో స్టాండ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఐతే వీరంతా కరీంనగర్‌లో 48 గంటలు గడపడంతో.. కరీంనగర్ అధికార యంత్రాంగం అప్రత్తమైంది. కరీంనగర్‌ కలెక్టరేట్ చుట్టుపక్కల 1 కి.మీ. పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి రక్త పరీక్షలు చేస్తున్నారు. వంద మంది వైద్య సిబ్బందితో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా కరోనా అనుమానితుంటే వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ షాపులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.

About The Author