హైదరాబాద్ నుంచి బైక్‌పై చెన్నై వెళ్లిన తమిళ హీరో అజిత్..


ఫొటోలు వైరల్! బైక్ రైడింగ్ అంటే ప్రాణం పెట్టే ప్రముఖ తమిళ నటుడు అజిత్ హైదరాబాద్ నుంచి బైక్‌పై బయలుదేరి దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై చేరుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణంలో ఆహారం, పెట్రోలు కోసం తప్ప మరెక్కడా ఆగలేదట. ‘వాలిమై’ సినిమా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో లాక్ డౌన్ కు ముందు కొన్ని సీన్లు చిత్రీకరించారు. వాటిలో బైక్ చేజింగ్ సన్నివేశం కూడా ఉంది. ఈ సినిమాలో అజిత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ను తయారుచేయించారు. ఈ బైక్‌పై ముచ్చటపడిన అజిత్.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అదే బైక్‌పై చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. అంతే.. విమానం టికెట్లు రద్దు చేసుకున్న అజిత్.. బైక్‌పై ఒంటరిగా చెన్నై బయలుదేరాడు. అతడి అసిస్టెంట్ మాత్రం విమానంలో చెన్నై చేరుకున్నాడు. అజిత్ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం విడుదల చేసి విషయం చెప్పడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవిషయం. అజిత్ ఎన్నో బైకర్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా కూడా బైక్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కాగా, అజిత్ గతంలో పూణె నుంచి చెన్నైకి బైక్‌పై ప్రయాణించాడు.

About The Author