బీజేపీ విజయానికి జనసైనికుల కృషి…పవన్ అభినందనలు…


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ నా తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున అభినందనలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న శ్రీ బండి సంజయ్ కి, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి, బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలని పవన్ పేర్కొన్నారు. బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతం అని ఆయన అన్నారు.

గెలుపునకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ, తెగువ ఆ పార్టీని విజయపదాన నడిపించాయని ఆయన అన్నారు. ఇంటింటికీ తిరిగి శ్రమకోర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చిందని అయన అన్నారు. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవడం నాకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు. 60 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసైనికులు బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకోవాలని కోరినప్పుడు వారి భవిష్యత్తును సైతం పక్కన పెట్టి బీజేపీ ప్రచారంలో మమేకమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని పవన్ పేర్కొన్నారు.

జనసైనికులు రాజకీయ భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని నిండైన మనసుతో హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా జనసేన పార్టీకి, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, బీజేపీతో భవిష్యత్తులో పరస్పర సహకారంతో కలిసి తెలంగాణలో కూడా పని చేస్తామని స్పష్టం చేస్తున్నానని ఆయన అన్నారు.

About The Author