నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం


ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతాడుకున్న వ్యక్తిని.. బస్సు రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని తిరుమలగిరి సమీపంలో శ్రీశైలం – హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సలయ్య అనే వ్యక్తి మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలగిరికి చెందిన పొలం సలయ్య(50) కల్వకుర్తి నుంచి టీవీఎస్‌ వాహనంపై తిరుమలగిరికి బయల్దేరాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతాడు అనుకున్న సమయంలో వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన సలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకుని కేసు నమోదు చేశాడు. మృతుడికి భార్య కళమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

About The Author