ఏ నిర్ణయమైనా నీ వెంటే..! ఈటలకు కొండా మద్దతు


పొమ్మనలేక పొగబెట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. రోజురోజుకు ఈటల రాజేందర్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈటలకు కొండంత మద్దతు లభించింది. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో కలిసి పని చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఈటలకు మద్దతు ప్రకటించారు. ఏ నిర్ణయమైనా తీసుకో అండగా ఉంటామని విశ్వేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఈటల నివాసంలో కొండా వచ్చారు. కొద్దిసేపు ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల భార్య జమున తనకు బంధువు అని తెలిపారు. ఈటల నా మిత్రుడని పేర్కొన్నారు. అయితే ఈటలతో రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు చాలాసార్లు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ నమ్ముకుని ఉంటే.. బయటకు పంపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకు నష్టం లేదని.. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఈ సమయంలోనే ఈటల రాజేందర్‌ బయటకు రావడంతో రాజకీయాలు మారే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కొండా మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

About The Author