కార్గిల్ విజయ్ దివస్…

“దేశ సరిహద్దులను కాపాడేది కేవలం ఆయుధాలు కాదు..వాటి వెనుక నిలిచే సైనికుడి ధైర్యం, త్యాగం, దేశభక్తి.” సరిగ్గా ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుద్ధమే *కార్గిల్ యుద్ధం*.
1999 వసంతకాలం… హిమాలయాల ఒడిలోని కార్గిల్ పర్వతాలు మంచుతో కప్పబడి నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక కుట్ర రూపుదిద్దుకుంటోంది. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్ సైనికులు నియంత్రణ రేఖ (LoC) దాటి భారత భూభాగంలోని ఎత్తైన శిఖరాలను రహస్యంగా ఆక్రమించారు. లక్ష్యం ఒక్కటే… శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిని తమ నియంత్రణలోకి తెచ్చి, లడఖ్ను భారత్ నుంచి వేరు చేయడం.
*ఒక గొర్రెల కాపరి అప్రమత్తత… యుద్ధానికి నాంది*
1999 మే 3.
కార్గిల్లోని మస్కో వ్యాలీ ప్రాంతంలో స్థానిక గొర్రెల కాపరి *తాషి నామ్గ్యాల్ యాదవ్* తన గొర్రెలను మేపుతుండగా కొండలపై అనుమానాస్పద కదలికలను గమనించాడు. వెంటనే భారత సైన్యానికి సమాచారం అందించాడు. ఆ సమాచారం సాధారణం కాదు… అది భారత చరిత్రలో ఒక మహాయుద్ధానికి నాంది పలికింది.
*ప్రారంభమైన ‘ఆపరేషన్ విజయ్’*
పరిస్థితి తీవ్రతను గ్రహించిన భారత సైన్యం వెంటనే ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది.
1999 మే 26న, భారత వైమానిక దళం కూడా రంగంలోకి దిగి ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) ద్వారా శత్రు స్థావరాలపై దాడులు ప్రారంభించింది.
యుద్ధం అంత సులభం కాదు. మంచుతో కప్పుకున్న ఎత్తైన శిఖరాలపై శత్రువు… దిగువ నుంచి ఎక్కాల్సిన పరిస్థితిలో భారత జవాన్లు. ప్రకృతి కూడా శత్రువుకు అనుకూలంగా నిలిచింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.
*త్యాగాలతో సాగిన పోరాటం..*
మే 27–28 తేదీల్లో భారత వైమానిక దళానికి చెందిన ఒక మిగ్-21, ఒక మిగ్-27 యుద్ధవిమానం, ఒక ఎంఐ-17 హెలికాప్టర్ యుద్ధంలో కోల్పోయాయి. ఫ్లైట్ లెఫ్టినెంట్ కె. నచికేత పాకిస్థాన్ చేతికి చిక్కి యుద్ధఖైదీగా మారినా, జూన్ 3న అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో , భారత్ అద్భుతమైన వ్యూహంతో విడుదలయ్యారు.
*టోలోలింగ్… టైగర్ హిల్… తిరుగులేని విజయాలు*
1999 జూన్ 13.
వీరుల రక్తంతో తడిసిన పోరాటం అనంతరం టోలోలింగ్ శిఖరం మళ్లీ భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరవేసింది. ఇదే యుద్ధంలో తొలి కీలక విజయం.
1999 జూలై 4.
ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తుండగా భారత జవాన్లు తమ అద్భుత పోరాట పటిమతో వేల అడుగుల ఎత్తులో ఉన్న టైగర్ హిల్పై స్వాధీనం చేసుకుని భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అది కేవలం ఒక కొండపై విజయం కాదు… భారత ఆత్మగౌరవం శిఖరాన రెపరెపలాడిన సందర్భం.
🇮🇳 *ప్రపంచం భారత్ వైపు నిలిచిన వేళ*
యుద్ధంలో ఓటమి తప్పదని గ్రహించిన పాకిస్థాన్ అంతర్జాతీయ జోక్యం కోరింది. కానీ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, నియంత్రణ రేఖ దాటి చొరబడింది పాకిస్థానేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరిపడగా, భారత్ నైతికంగా, దౌత్యపరంగా , వ్యూహాత్మకంగా కూడా విజయం సాధించింది.
*1999 జూలై 15న, అప్పటి గౌరవ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైందని ప్రకటించారు*
*జూలై 26 – విజయానికి ప్రతీక*
1999 జూలై 26.
కార్గిల్, ద్రాస్ ప్రాంతాల్లోని ఆక్రమిత శిఖరాలన్నింటినీ భారత సైన్యం పూర్తిగా శత్రురహితంగా మార్చింది. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది *కార్గిల్ విజయ్ దివస్* గా దేశం గర్వంగా జరుపుకుంటోంది.
*అమరుల త్యాగం – దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది*
ఈ 74 రోజుల యుద్ధంలో…
– 🇮🇳 527 మంది భారత జవాన్లు మాతృభూమి కోసం వీరమరణం పొందారు.
– 1,363 మంది గాయపడ్డారు.
– ఫ్లైట్ లెఫ్టినెంట్ కె. నచికేత యుద్ధఖైదీగా బంధించబడి, తరువాత సురక్షితంగా విడుదలయ్యారు.
– భారత అంచనాల ప్రకారం 700–1,200 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు, చొరబాటుదారులు హతమయ్యారు. అనంతరం పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ వైపు నష్టం మరింత ఎక్కువగా జరిగిందని అంగీకరించారు.
🏅*శౌర్యానికి అత్యున్నత గౌరవ పురస్కారం*
కార్గిల్ యుద్ధంలో అసాధారణ వీరత్వం ప్రదర్శించిన నలుగురు మహావీరులకు దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర ప్రదానం చేయబడింది.
– *కెప్టెన్ విక్రమ్ బాత్రా (మరణానంతరం)*
– *లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ *పాండే (మరణానంతరం)*
– *రైఫిల్మన్ సంజయ్ కుమార్*
– *గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్*
*కెప్టెన్ విక్రమ్ బాత్రా పలికిన “యే దిల్ మాంగే మోర్” అనే మాటలు భారత యువతలో నేటికీ దేశభక్తి జ్వాలలను, త్యాగాలకు సిద్ధంగా ఉన్నామనే స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి*
కార్గిల్ యుద్ధం కేవలం సరిహద్దుల కోసం జరిగిన పోరాటం కాదు. అది దేశ సమైక్యత, సైనికుల త్యాగం, ప్రజల ఐక్యత, భారత సంకల్పం ప్రపంచానికి తెలియజేసిన యుద్ధం.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శతకోటి ప్రణామాలతో….. ఘన నివాళులు అర్పిస్తూ….
వందే మాతరం! జై హింద్! 🇮🇳
