యూపీఐపై ఛార్జీలు …

మళ్లీ జనం ఏటీఎంల బాట పడతారా? అసలు నిజాలేంటి?
కరోనా వచ్చిన కొత్తలో మనందరికీ ఓ అలవాటు మొదలైంది. జేబులో రూపాయి నోటు లేకపోయినా, ఫోన్ ఉంటే చాలు కొండలనైనా దాటొచ్చనే ధీమా వచ్చింది. టీ కొట్టు దగ్గర అయిదు రూపాయల మొదలుకుని, కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, పెద్ద పెద్ద బట్టల షాపుల దాకా ఎక్కడ చూసినా ఆ నల్లటి క్యూఆర్ కోడ్ స్టిక్కర్లే. ‘చిల్లర లేదు’ అనే గొడవే లేకుండా చిటికెలో పని పూర్తయిపోయేది. ‘
డిజిటల్ ఇండియా’,
‘దొంగనోట్లకు చెక్’ అంటూ ప్రభుత్వమూ మనల్ని బాగా ప్రోత్సహించింది, మనమూ అలవాటు పడిపోయాం.
అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా… యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు పడబోతున్నాయనే వార్త బయటకు రాగానే అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలైంది. “అలవాటు చేశాక నెమ్మదిగా వాత పెడుతున్నారా?”, “ఇకపై మళ్లీ పాత రోజుల్లాగా ఏటీఎంల దగ్గర క్యూ కట్టి క్యాష్ వాడాల్సిందేనా?” అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదడులోనూ మెదులుతున్నాయి.
అసలు ఈ కొత్త నిబంధనలు ఎవరిపై పడతాయి? దీని వెనుక ఉన్న లాభనష్టాలేంటి? క్లియర్గా తెలుసుకుందాం.
కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIఅక్టోబర్ 15 నుంచి తీసుకురానున్న మార్గదర్శకాలు
సాధారణ వ్యాపారులకు రూ. 2 వేలు దాటి చేసే పేమెంట్స్పై 0.40 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు MDR ఛార్జీ పడుతుంది.
ఉదాహరణకు రూ. 2,000 పేమెంట్కు రూ. 4, రూ. 3,000కి రూ. 12, రూ. 50,000 దాటితే రూ. 200, రూ. 75,000 పైబడిన బిల్లులకు గరిష్టంగా రూ. 300 ఛార్జీ నిర్ణయించారు.
రైల్వే, ఫోన్ రీఛార్జ్లు, ఇన్సూరెన్స్, పెట్రోల్-డీజిల్ బంకుల్లో రూ. 2 వేలు దాటిన ప్రతి బిల్లుపై స్థిరంగా రూ. 5 మాత్రమే ఫీజు ఉంటుంది.
షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే పెట్టుబడులపై 0.02 శాతం స్వల్ప ఛార్జీ అమలవుతుంది.
అయితే, నెలకు తమ బ్యాంక్ ఖాతాలోకి రూ. 1 లక్ష వరకు క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు రూపాయి కూడా ఛార్జీ ఉండదు.
ఈ రోజుల్లో యూపీఐ అనేది ఒక సదుపాయం మాత్రమే కాదు, మన జీవితాల్లో ఒక భాగమైపోయింది. దానికి నిదర్శనమే ఈ లెక్కలు:
దేశవ్యాప్తంగా దాదాపు 55 కోట్లకు పైగా ప్రజలు రోజూ యూపీఐని వాడుతున్నారు.
దాదాపు 6.5 కోట్లకు పైగా వ్యాపార సంస్థలు క్యూఆర్ కోడ్ ద్వారానే లావాదేవీలు నడుపుతున్నాయి.
ప్రతి నెలా సగటున 2,200 కోట్ల నుంచి 2,300 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే రోజుకు దాదాపు 70 కోట్ల పేమెంట్స్.
నెలకు దాదాపు రూ. 28 నుంచి 29 లక్షల కోట్ల విలువైన సొమ్ము యూపీఐ ద్వారా చేతులు మారుతోంది. దేశంలో జరిగే మొత్తం చిల్లర డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా ఏకంగా 84 శాతం పైనే ఉంది.
మరి ప్రభుత్వం ఛార్జీలు ఎందుకు తెస్తోంది? అంటే
ఇప్పటివరకు యూపీఐ సిస్టమ్ను ప్రభుత్వం తన బడ్జెట్ నిధులతో సబ్సిడీలు ఇస్తూ పూర్తిగా ఉచితంగా నడిపించింది. కానీ రోజుకు 70 కోట్ల లావాదేవీలు జరుగుతుంటే సర్వర్లు మొరాయించకుండా ఉండాలన్నా, సాంకేతికతను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలన్నా, ఆన్లైన్ మోసాలు జరగకుండా సైబర్ భద్రత కల్పించాలన్నా బ్యాంకులకు, ఎన్పీసీఐకి వేల కోట్ల రూపాయల నిర్వహణ ఖర్చు అవుతోంది.
ఎప్పటికీ ప్రభుత్వ సాయం మీదే ఆధారపడకుండా, వ్యవస్థ తన కాళ్లపై తాను నిలబడేలా చేయడానికే ఈ నామమాత్రపు ఛార్జీలు తెచ్చారు.
నిజానికి మనం షాపుల్లో స్వైప్ చేసే క్రెడిట్ కార్డులపై వ్యాపారులు 1.5% నుండి 2.5% వరకు ఛార్జీలు చెల్లిస్తుంటారు. డెబిట్ కార్డులపైనా 0.90% వరకు కట్ అవుతుంది. వాటితో పోలిస్తే యూపీఐపై తెచ్చిన 0.40% చాలా తక్కువ.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలకు ఊరట: నెట్వర్క్ నిర్వహణకు అవసరమైన ఆదాయం దక్కుతుంది. తరచూ వచ్చే సర్వర్ డౌన్ సమస్యలు, పేమెంట్ ఫెయిల్ అయ్యే తిప్పలు తప్పుతాయి.
సామాన్యుడికి ఢోకా లేదు
ఒకరికొకరు పంపుకునే వ్యక్తిగత లావాదేవీలు P2Pఅలాగే రూ. 2 వేల లోపు చేసే రోజువారీ ఖర్చులు మునుపటిలాగే పూర్తిగా ఉచితం.
చిన్న వ్యాపారులకు రక్షణ
నెలకు లక్ష రూపాయల లోపు వ్యాపారం చేసే వీధి వ్యాపారులు, చిరు దుకాణదారులకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
పెద్ద వ్యాపారులపై స్వల్ప భారం: రూ. 2 వేలు దాటిన బిల్లులపై వ్యాపారుల లాభాల్లో కొంత కోత పడుతుంది. అయితే కార్డుల మెషీన్ల కంటే యూపీఐ ఇంకా చవకే కాబట్టి పెద్ద వర్తకులకు ఇది మరీ పెద్ద నష్టమేమీ కాదు.
వచ్చే చిక్కల్లా ఇక్కడే..నిబంధనల ప్రకారం ఈ ఛార్జీని వ్యాపారే భరించాలి తప్ప కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదు. కానీ కొన్ని చోట్ల వ్యాపారులు రూ. 2 వేలు దాటితే “క్యాష్ ఇస్తేనే డిస్కౌంట్” అనో లేదా బిల్లులో పరోక్షంగా ఛార్జీ కలిపేసో కస్టమర్పైనే భారం మోపే ప్రమాదం ఉంది..
