6.5 కిలోల గంజాయి స్వాధీనం ​ముగ్గురు నిందితుల అరెస్ట్

తిరుపతి జూలై 27: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

ఈ క్రమంలో, పెనగలూరు మండల పరిధిలోని బెస్తపల్లి గ్రామ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్‌ఐ శ్రీ అరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు.

6.5 కిలోల గంజాయి

ఒక టాటా సుమో వాహనం

మూడు మొబైల్ ఫోన్లు

అరెస్టు చేసిన నిందితులు.

కంచర్ల సుబ్బారెడ్డి (71) – చక్రంపేట గ్రామం, పెనగలూరు మండలం.

తోడేటి శేఖర్  బుజ్జి (50) – బోయినపల్లి గ్రామం, రాజంపేట మండలం.

వడివేలు శీలంబర్సన్  అజయ్ (37) – సెనగతకులం, వడమధురై పోస్ట్, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు.

పరారీలో ఉన్న నిందితుడు

సుబ్బారాయుడు, నల్లతిమ్మయ్యగారిపల్లి, నందలూరు మండలం.

ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని సేకరించి పరిసర గ్రామాలు మరియు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులు, సరఫరా మార్గాలు, ఆర్థిక లావాదేవీలు మరియు సంబంధిత నెట్‌వర్క్‌ను పూర్తిగా వెలికితీసేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వ్యక్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థితి, సామాజిక భద్రత, యువత భవిష్యత్తు మరియు సమాజ శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనను కేవలం పోలీసుల బాధ్యతగా కాకుండా, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులు, అలవాట్లు, రోజువారీ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు మరియు సమాజ పెద్దలు యువతలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యువత తమ విద్య, ఉపాధి, లక్ష్యాలు మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు విజ్ఞప్తి

గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని జిల్లా పోలీసులు హామీ ఇచ్చారు.

మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పండి… యువతను కాపాడండి… ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం.

తిరుపతి జిల్లా పోలీసు శాఖ

About The Author