ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల భద్రతకు పటిష్ట చర్యలు.
తిరుపతి ఆగష్టు 13: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో విద్యార్థుల భద్రత, భద్రతా ప్రమాణాలు మరియు నేరాల నివారణ చర్యలపై *తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు గురువారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నేటి సమాజంలో ఎదురవుతున్న నూతన తరహా నేరాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ భద్రత తదితర అంశాలపై పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు ఎస్పీ గారు* దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా *ఎస్పీ గారు* మాట్లాడుతూ… “విద్యార్థుల భద్రత అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, పోలీసులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే మన పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించగలం” అని అన్నారు.
“నేటి విద్యార్థులను కేవలం మంచి మార్కులు సాధించేలా తయారు చేయడం మాత్రమే విద్యాసంస్థల లక్ష్యం కాకూడదు. మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, మానవతా దృక్పథం, సమాజం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దడమే అసలైన విద్య యొక్క లక్ష్యం” అని ఎస్పీ గారు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి,
ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లు విద్యార్థుల జీవితాల్లో భాగమవుతున్నాయని, సాంకేతికత అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన సాధనాలు దుర్వినియోగం అయితే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎస్పీ గారు తెలిపారు.
తల్లిదండ్రులు తమ బిజీ జీవితాల్లో పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్న పరిస్థితుల్లో, పిల్లలు సోషల్ మీడియాలో చూసే కంటెంట్పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని సూచించారు. పిల్లలకు సాంకేతికతను దూరం చేయడం పరిష్కారం కాదు.. దాన్ని బాధ్యతగా, సురక్షితంగా ఎలా ఉపయోగించాలో నేర్పించడమే అసలైన పరిష్కారం అని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా వేధింపులు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఐడెంటిటీ థెఫ్ట్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు, వ్యక్తిగత ఫొటోలు మరియు వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను చిన్న వయసు నుంచే పిల్లలకు వివరించాలని తెలిపారు.
మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన.
గంజాయి, మత్తు పదార్థాలు మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ గారు సూచించారు. NDPS చట్టం కింద మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు తెలియజేయాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా వారిలో అవగాహన, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని తెలిపారు.
విద్యార్థుల రవాణాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి,
స్కూల్ బస్సులు, వ్యాన్లలో విద్యార్థుల రవాణా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. డ్రైవర్కు సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో పాటు, వాహన ఫిట్నెస్, ఇతర రవాణా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రతి స్కూల్ బస్సు లేదా వ్యాన్లో డ్రైవర్తో పాటు అటెండర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలి.
విద్యార్థులు వాహనంలోకి ఎక్కే సమయంలో, దిగే సమయంలో అటెండర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా హైవేలు మరియు రద్దీ రహదారులపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రతి విద్యాసంస్థలో CCTV కెమెరాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, విద్యార్థుల భద్రతలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఎస్పీ గారు సూచించారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలు, విద్యార్థుల రాకపోకలు జరిగే ముఖ్యమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు ఉండాలని తెలిపారు.
CCTV కెమెరాలు ఏర్పాటు చేసినంత మాత్రాన భద్రత పూర్తయినట్లు కాదని, కెమెరాల పనితీరు, రికార్డింగ్, స్టోరేజ్ మరియు అవసరమైన సమయంలో ఫుటేజ్ అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని తెలిపారు. అవసరమైన చోట పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని CCTV వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్పీ గారు అన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులపై వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
పిల్లలు ఏదైనా సమస్యను చెప్పినప్పుడు వారిని భయపెట్టకుండా, నిందించకుండా, వారి మాటలను శ్రద్ధగా విని తగిన సహాయం అందించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత, విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, డ్రైవర్లు కూడా రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ గారు తెలిపారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తిరుపతి జిల్లాలో పోలీసు–విద్యాసంస్థల సమన్వయంతో మరింత సురక్షితమైన సమాజాన్ని, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకం. ఒక విద్యార్థిలో మంచి ఆలోచన, మంచి అలవాటు, మంచి విలువను చిన్న వయసులోనే నాటగలిగితే అది భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని నిర్మిస్తుంది” అని ఎస్పీ గారు అన్నారు.
విద్యార్థులను *“మంచి పౌరులుగా తీర్చిదిద్దడం అనేది పోలీసులకే కాదు.. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం కలిసి నిర్వహించాల్సిన బాధ్యత”* అని తెలిపారు.
తిరుపతి జిల్లా విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతికతతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, మానవతా విలువల్లో కూడా ముందుండి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
విద్యార్థుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మహిళా పోలీస్ విభాగం, సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ఇతర పోలీసు విభాగాలు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి పాఠశాల, కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీస్ శాఖ మరియు ఈగల్ శాఖ సూచనలు అత్యవసర సంప్రదింపు వివరాలతో కూడిన అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేయాలని, పోలీసు శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని యాజమాన్యాలను కోరారు.
*“సురక్షితమైన విద్యాసంస్థలు.. సురక్షితమైన విద్యార్థులు.. బాధ్యతాయుతమైన పౌరులు.. సురక్షితమైన సమాజం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.*
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లు, శ్రీ శ్రీనివాసులు, (అడ్మినిస్ట్రేషన్), శ్రీ రవి మనోహరాచారి,(శాంతిభద్రతలు) మహిళా పోలీస్ విభాగం అధికారులు, సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
