టీటీడీ కొత్త చైర్మన్ గా నియమించబడిన వై.వీ. సుబ్బారెడ్డి గారు హిందువా ? లేక క్రైస్తవులా?


టీటీడీ కొత్త చైర్మన్ గా నియమించబడిన వై.వీ. సుబ్బారెడ్డి గారు హిందువా ? లేక క్రైస్తవులా?

జగన్ గారి కుటుంబ సభ్యులు కాబట్టి ఆయన కూడా క్రైస్తవులు అనే అనుమానం రావడం సహజం. అయితే ఆయన క్రైస్తవుడు అని ఖచ్చితంగా అయతే చెప్పలేము. ఆయన మాల వేసుకున్న ఫొటోలూ, యాగాలు చేస్తున్న ఫొటోలూ చాలామంది పెడుతున్నారు. అలానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుబ్బారెడ్డి గారి గురించి చెప్పిన వీడియో కూడా ఒకటి చూశాను. అందులో సుబ్బారెడ్డి గారు సంప్రదాయాలని బాగా పాటించే హిందువు అని చెప్పారు. అయితే వికీపీడియాలో క్రైస్తవులు అని ఉంది కదా అనవచ్చు. దానిని ఎవరైనా మార్చవచ్చు. కేవలం వికీపీడియాలో ఉంది అని దేనిని నమ్మలేము. వికీపీడియాలో రిఫరెన్సుల ఆధారంగానే దేనినైనా నమ్మాలి. కాబట్టి, ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే, సుబ్బారెడ్డి గారు క్రైస్తవులు అని అనుమానించడానికి ఏ ఆధారాలూ లేవు. కొందరు చెప్తున్నట్లుగా ఆయన నికార్సైన హిందువే అవ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మరి అటువంటప్పుడు ఆయన మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎందుకు పోస్ట్ పెట్టారు అని కొందరు అడగవచ్చు. దానికి రెండు కారణాలు ఉన్నాయి

A. రాజశేఖర్ రెడ్డిగారి పాలన సమయంలో క్రైస్తవ వ్యాప్తికి సహకరించేలా ఆయన చేసిన నిర్ణయాలు

B. గత రెండువేల సంవత్సరాలుగా క్రైస్తవ మతవ్యాప్తిలో రాజకీయ నాయకత్వాన్ని ఉపయోగించుకున్న తీరు.

రాజశేఖరరెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు

1. తిరుమల 7 కొండలలో 5 కొండలని విహారప్రాంతంగా మార్చాలి అని ప్రయత్నించారు
2. లడ్డు ప్రసాదం కాంట్రాక్ట్ ఒక క్రైస్తవుడికి ఇచ్చారు
3. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎన్నో విద్యాసంస్థలలో క్రైస్తవులని ఉన్నత స్థానాలలో నియమించారు. వారు ఆ సంస్థలలో ఉంటూ మతమార్పిడులకు ప్రయత్నించారు
4. శ్రీరామనవమికి సెలవు తీసేశారు [1]
5. ఆయన సమయంలో క్రైస్తవ వ్యాప్తి విపరీతంగా జరిగింది [2].
6. కంచి జయేంద్ర సరస్వతి స్వామీజీ వారిని తమిళనాడు పోలీసులు దీపావళి రోజున నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పుడు ఆయన ఆంధ్రా పర్యటనలో ఉన్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే [3]

ఇప్పుడు ఒకసారి క్రైస్తవ మతవ్యాప్తి ఎలా పెరిగిందో చరిత్రని చూద్దాం

1. కొంచెం అటుఇటుగా 50వ సంవత్సరంలో ప్రారంభం అయిన క్రైస్తవ వ్యాప్తి తరువాతి 250 సంవత్సరాలలో పెద్దగా వృద్ధి చెందలేదు. 312 నాటికి రోమన్ సామ్రాజ్యంలో 10% మంది మాత్రమే క్రైస్తవులు ఉండేవారు (ఇది కూడా తక్కువేమీ కాదు). కానీ 312లో మొదటి సారి క్రైస్తవుడు అయిన కాన్స్టాన్టిన్ రోమన్ చక్రవర్తి అయ్యాడు. అతని తరువాతి వారందరూ, 1.5 సం. లు పాలించిన జూలియన్ తప్ప, అందరూ క్రైస్తవులే. ఈ కారణం వలన 400వ సం. వచ్చే నాటికి రోమన్ సామ్రాజ్యంలో 50% మంది క్రైస్తవులుగా మారిపోయారు. పాలకులందరూ క్రైస్తవ వ్యాప్తికి అనుకూలమైన నిర్ణయాలనే తీసుకున్నారు.

2. తర్వాత కాలంలో కూడా క్రైస్తవ వ్యాప్తి కేవలం వలస పాలనకు గురి అయిన దేశాలలో మాత్రమే జరిగింది. అందుకే క్రైస్తవం కేవలం బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగీస్, బెల్జియంల ఆక్రమణకు గురియైన దేశాలలో మాత్రమే ఉంది. ఒక్క దక్షిణకొరియా ని ఇందుకు మినాహాయింపు చెప్పవచ్చు. అక్కడ ప్రస్తుతం 25% వరకూ క్రైస్తవులు ఉన్నారు.

అంటే క్రైస్తవ అనుకూల రాజకీయ నాయకత్వం ద్వారా క్రైస్తవాన్ని వ్యాప్తి చెయ్యడం 2000 సం. లుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కారణాల వలన జగన్ గారు తీసుకునే నిర్ణయాలని, ముఖ్యంగా ధర్మ, మత సంబంధమైన వాటిని నేనైతే అనుమానంతోనే చూస్తాను. గత 5 సంవత్సరాలలో జగన్ గారు, స్వామీజీల చుట్టూ, గుళ్లచుట్టూ తిరిగి తనపై ఉన్న క్రైస్తవ ముద్రని కొంతమేర పోగొట్టుకున్నారు. ఈ కారణం వలన సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండేవారు తప్ప, బయటి వారిలో చాలామంది ఆయనని క్రైస్తవుడిగా చూడటం లేదు. ఈ పని ఆయన త్రికరణ శుద్ధిగా చేసిఉంటే సంతోషమే.

ఎన్నికల ముందు ఏమి చేసినా, అధికారంలోకి వచ్చాక ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా కీలకం. తాను ఎన్నికలకు ముందు గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్ళింది కేవలం ఓట్ల కోసం కాదని ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలి. అలా నిరూపించుకునే వరకూ ఆయన ప్రతీ నిర్ణయాన్ని అనుమానించడం తప్పనిసరి. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా ఆంద్రప్రదేశ్ కూడా మరో కేరళలానో, నాగాలాండ్ లానో, మిజోరాంలానో తయారవుతుంది. అయితే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన కొన్ని నియమాకాలు అటువంటి నమ్మకాన్ని కలిగించడం లేదు.

నావంటి వారి అనుమానాలన్నీ అబద్దం అవ్వాలని, జగన్ గారు ముఖ్యమంత్రిగా అందరికీ మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారు అని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే, హిందువులలో జగన్ గారి మీద నమ్మకం కలగడానికి కారణమైన స్వామీజీలు ముందుకు వచ్చి హిందువుల తరఫున పోరాడాలి.

జై శ్రీరాం

1. https://youtu.be/HCefovkAe74
2. http://indiafacts.org/evangelism-made-andhra-economic-cultural-spiritual-ruin/
3. https://m.rediff.com/news/2004/nov/12kanchi8.htm

About The Author