కనుమరుగు కానున్న గతకాలపు జ్ఙాపకాలు…. తెలంగాణ కొత్త సచివాలయానికి ఈనెల 27న ముహూర్తం…?


కనుమరుగు కానున్న గతకాలపు జ్ఙాపకాలు…. తెలంగాణ కొత్త సచివాలయానికి ఈనెల 27న ముహూర్తం…?

* భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

* ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే కొత్త భవనం

* ఏ, బీ, సీ, డీ బ్లాకులు కూల్చి అక్కడే కొత్త సచివాలయ
నిర్మాణం

* ఏపీ భవనాల స్వాధీనానికి చర్యలు ముమ్మరం

* తెలంగాణ సీఎస్ తో భేటీ అయిన ఇరు రాష్ట్రాల అధికారులు

* భవనాలను వెంటనే అప్పగించాలని ఏపీ కి సూచన

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైందని విశ్వసనీయ వర్గాల సమా చారం..?

ఈ నెల 27 దాటితే… మరో మూడు నెలల వరకు మంచి ముహుర్తాలు లేనందున తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 27 న భూమి పూజ చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రాష్ట్ర విభజన అనంతరం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణకు, ఎల్, జే, హెచ్, కే బ్లాకులను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే…. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఉన్న ఏ,బి,సి,డి బ్లాకులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో… ఏపీ అధీనంలోని బ్లాకుల అప్పగింత పూర్తయిన వెంటనే తెలంగాణ సచివాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను ఆయా భవనాలకు తరలించి, ఏ, బీ, సీ, డి బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

వెంటనే భవనాలు అప్పగించండి: తెలంగాణ సీఎస్‌

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను గవర్నర్ ఉత్తర్వుల నేపథ్యంలో వెంటనే తమ రాష్ట్రానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి కోరారు. ప్రధానంగా సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను వీలైనంత త్వరగా అప్పగించాలని ఆయన పేర్కొన్నారు.

ఏపీ అధీనంలో ఉన్న భవనాల అప్పగింత అంశంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్స్‌ అఫీషియో) ఎల్‌. ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో… సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్ లొ సమావేశమై చర్చించారు. భవనాల అప్పగింత ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎస్‌ ఎస్‌కే జోషి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా సమావేశానికి హాజరైన ప్రేమ్‌చంద్రారెడ్డిని కోరారు.

అయితే..‌ భవనాల అప్పగింత అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రేమ్‌చంద్రారెడ్డి తెలంగాణ సీఎస్‌కు తెలిపారని సమాచారం.

సచివాలయంలోని జే బ్లాక్‌ భవన సముదాయం నుంచి ముఖ్యమైన ఫైళ్లు, ఇతర సామగ్రిని సోమవారం ఏపీ అధికారులు రెండు లారీల్లో నింపి అమరావతికి తరలించారు. ఈ అంశం పై మీడియా… ‘ప్రేమ్‌చంద్రారెడ్డిని సంప్రదించగా… ఏపీకి కేటాయించిన భవనాలను ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించాలని తనకు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వశాఖలు తమ ఫైళ్లను అమరావతికి తరలించుకోవడం కొత్త విషయం కాదన్నారు.

ఏది ఏమైనా… ఉమ్మడి రాష్ట్రానికి దశాబ్దాల పాటు సేవలందించిన భవనాలు… ప్రజలకు, ముఖ్యంగా సచివాలయ పాత్రికేయులకు.‌‌.. గతకాలపు తీపి గుర్తలుగా మారనున్నాయి..‌

ప్రముఖ పాత్రికేయులు, #భండారు_శ్రీనివాసరావు గారు తరచూ ప్రస్తావించే విధంగా… గత వైభవ ఆనవాళ్ళను కూల్చివేసే ముందు..‌.. వాటి ఛాయా చిత్రాలను, వీలైనంత వరకు బ్లాకుల వారీగా వీడియో ఫుటేజీలను ప్రస్తుత కాలపు డిజిటలైజేషన్ విధానంలో భావితరాల వారికోసం భద్రపరిచడం చారిత్రక అవసరమనే ఈ అంశాన్ని పాలకులు గుర్తెరుగుతారని ఆశిద్దాం..!

About The Author