శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ సిద్ధం…


తిరుమల, 2019 సెప్టెంబరు 27: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును శుక్ర‌వారం టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌కు అందించారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను తిరుపతి సమీపంలోని వ‌డ‌మ‌ల‌పేట‌ వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడ‌ల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఆర్‌వోలు శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ శివకుమార్, బొక్కసం ఇన్‌చార్జ్‌ శ్రీ గురురాజస్వామి, ఆల‌య‌ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

About The Author