కరోనా వైరస్ రోగి బయటకు వస్తే … నడి రోడ్లో కాల్చి పారేశారు…


ఉత్తరకొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో, అక్కడ పాలన ఎంత నిరంకుశంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొవిడ్‌-19(కరోనా కొత్త పేరు) వైరస్‌ అనుమానంతో ఓ వాణిజ్య అధికారిని నిర్బంధించారు. అయితే, నిబంధనలు ఉల్లంఘించి అతడు బయటకు రావడంతో అక్కడికక్కడే కాల్చిపారేశారట. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తపత్రిక తన కథనంలో పేర్కొంది.
సదరు అధికారి ఇటీవలే చైనా నుంచి స్వదేశానికి వచ్చాడు. చైనాలో విజృంభించిన వైరస్‌ భయంతో అతడు ఉత్తరకొరియాకు తిరిగిరాగానే పర్యవేక్షణ పేరుతో నిర్బంధించారు. అయితే ఇటీవల అతడు ఓ ప్రజా స్నానాల గది దగ్గర కన్పించడంతో వెంటనే అరెస్టు చేసిన అధికారులు అక్కడికక్కడే కాల్చి చంపినట్లు ఆ వార్తాకథనం పేర్కొంది. వైరస్‌ ఇతరులకు వ్యాపించేలా ప్రమాదకరంగా ప్రవర్తించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తమ దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్న కఠిన విధానాలు తీసుకొచ్చారు. చైనా నుంచి వచ్చిన వారిని, చైనీస్‌ ప్రజలను కలిసివారిని నిర్బంధించమని ఉత్తర్వులు జారీ చేశారు. చైనాతో సరిహద్దులను కూడా మూసేశారు. ఈ నేపథ్యంలో సదరు వాణిజ్య అధికారి నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిని చంపినట్లు తెలుస్తోంది. అంతేగాక, చైనా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో ఉన్నత స్థాయి అధికారిని దేశం నుంచి బహిష్కరించినట్లు సమాచారం.

About The Author