గొర్రెల కాపరికి కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌లో మేకలు, గొర్రెలు

అందరి నోటా ఒకటా మాట..! కరోనా..కరోనా..! అంతలా అందరినీ వణికిస్తోంది కోవిడ్ మహమ్మారి..! మనుషులకే కాదు జంతువులకూ కష్టాలు తెస్తోంది. గొర్రెల కాపరికి కరోనా సోకడంతో దాదాపు 50 గొర్రెలు, మేకలను పశు సంవర్ధక అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. వాటికి శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో గ్రామస్తుల్లోనూ ఆందోళన నెలకొంది. తమకూ కరోనా సోకుతుందేమోనని భయపడిపోతున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లా గోడెకెరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరికి ఇటీవల కరోనా సోకింది. ఆ తర్వాత అతడు మేపే మేకలు, గొర్రెల్లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. జలుబుతో పాటు శ్వాస సంబంధ ఇబ్బందులు ఉండడంతో గ్రామస్తులు అప్రమతయ్యారు.ఈ విషయాన్ని తుమకూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కె. రాకేష్ కుమార్‌తో పాటు పశుసంవర్థకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.మంత్రి ఆదేశాలతో పశు సంవర్ధకశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి మేకలు, గొర్రెలను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్‌కు పంపించారు. పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఐతే వాటికి మేక ప్లేగు వ్యాధి, మైకో ప్లాస్మా ఇన్ఫెక్షన్ వచ్చిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఐతే అది కూడా అంటు వ్యాధి కావడంతో ఇతర జంతువులకు సోకకుండా ఆ మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచారు.

About The Author