ఫుట్‌పాత్‌పై ఒంటరిగా చిన్నారి…


తిరుపతి :
కళ్ల ముందు ఎందరో వెళుతున్నా అమ్మానాన్నలు కనిపించలేదు. తానెందుకు ఇక్కడ ఉన్నానో దిక్కు తోచని స్థితిలో కళ్లప్పగించి నిట్టూర్చుతోంది ఏడాదిన్నర బాలిక. ఆ కుటుంబంలో ఎవరికి ఏ కష్టమొచ్చిందో.. మాయదారి కాలం పాపను రుయా ఆస్పత్రి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఒంటరి చేసింది. అలిపిరి ఎస్‌ఐ షేక్‌షావల్లీ కథనం మేరకు.. తిరుపతిలో ఎస్వీ మెడికల్‌ కళాశాల-రుయా ఆస్పత్రి మధ్య ఉన్న ఫుట్‌పాత్‌పై ఏడాదిన్నర బాలిక ఒంటరిగా ఉన్నట్లు బుధవారం సాయంత్రం సమాచారం వచ్చింది. అక్కడికెళ్లి చూడగా ఒంటరిగా ఓ పాప ఉంది. ఎవరు..? అమ్మానాన్న ఎక్కడని అడిగినా పెద్దగా స్పందించలేదు. అప్పటికే స్థానికులు నీళ్ల సీసా, బిస్కెట్లు అందించారు. శిశు సంక్షేమ శాఖకు తెలియజేయగా కరోనా పరీక్షలు నిర్వహిస్తే గురువారం ఉదయం తీసుకెళుతామని చెప్పారు. రాస్‌ ఛైల్డ్‌ లైన్‌ టీమ్‌ సభ్యుల సహకారంతో స్థానిక బైరాగిపట్టెడలోని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ హోమ్‌లో బుధవారం రాత్రి ఉంచారు. గురువారం పరీక్ష చేసి తిరుపతి రాజన్న పార్కు సమీపంలోని చిన్న పిల్లల హోమ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు

About The Author