నోట్ల రద్దు నిర్ణయం వల్ల నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.. మాజీ ప్రధాని, మన్మోహన్​ సింగ్​


కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్​నేత మన్మోహన్​ సింగ్​ విమర్శించారు.

దానివల్ల అసంఘటిత రంగమూ అతలాకుతలం అయిందని ఆరోపించారు.

ప్రసుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వనికి సమాఖ్య వ్యవస్థపై గౌరవం లేదని, చాలా విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరదని అన్నారు.

కేరళ అభివృద్ధి కోసం రాజీవ్​గాంధీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డెవలప్​మెంట్​ స్టడీస్​ ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్​గా పాల్గొన్నారు మన్మోహన్​.

“భారత ఆర్థికరంగానికి , రాజకీయ సిద్ధాంతానికి సమాఖ్య వ్యవస్థ మూలస్తంభం లాంటిది.

అయితే రాజ్యంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు.

2016లో కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

నిరుద్యోగం విపరీతంగా పెరగడానికి కారణమైంది.”

కేరళ సామాజికంగా మెరుగ్గా ఉందని మన్మోహన్​ అన్నారు.

కానీ రాష్ట్రం.. చాలా రంగాల్లో భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

కేరళ అభివద్ధి పథంలో పయనించడానికి అనేక అవరోధాల్ని అధిగమించాల్సి ఉందని తెలిపారు.

రెండు మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమనం, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం కేరళనూ దెబ్బకొట్టిందని అన్నారు.

కరోనా సమయంలోనూ డిజిటల్​ విధానంలో పనిచేయడం వల్ల ఐటీ రంగం ఎలాంటి కుదుపులకు లోనవ్వలేదని, కానీ పర్యటక రంగం మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా, నోట్ల రద్దువల్ల వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి.. గతంలో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ కూటమి తీసుకున్న నిర్ణయాలు కేరళకే కాదు దేశానికీ అవసరమని ​ అన్నారు.

కష్టకాలంలో ఉన్న సామాన్యుడికి అవి దారి చూపే దీపాల్లాంటివని ప్రశంసించారు.

About The Author