హైదరాబాద్‌ కీర్తిపతాకలో మరో కలికితురయి


హైదరాబాద్‌ కీర్తిపతాకలో మరో కలికితురయి, రాష్ట్రంపై రాడార్‌ కన్ను!, నేరగాళ్లకు ఇక సింహస్వప్నమే
త్వరలో అందుబాటులోకి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
హైదరాబాద్‌ కీర్తిపతాకలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. రాష్ట్రంలోని ప్రతి అంగుళంపైనా ఇక నిరంతర నిఘా కొనసాగనుంది. ఎక్కడ, ఎప్పుడు ఏం జరిగినా ఇట్టే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ణానం, అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ట్విన్‌ టవర్స్‌) త్వరలో అందుబాటులోకి రానుంది. నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో ఈ ఏడాది చివరి నాటికి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీని ఏర్పాటుతో ఒక లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తెలంగాణలోని చెట్టు, పుట్టా, చేను, వాగు ఇలా ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నా రు. కాగా, ఈ సెంటర్‌ నిర్మాణానికి మొదట 350 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2019లో ఆ మొత్తం 450 కోట్లకు పెరిగింది. గతేడాది చివరలో అపెక్స్‌ కమిటీ సమావేశంలో మరో రూ.200 కోట్ల వరకు అవసరమనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.

*ఎన్నెన్నో ప్రత్యేకతలు*
ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో (ఏ, బీ, సీ, డీ ) కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లు నిర్మిస్తున్నారు. టవర్‌-ఏ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా టవర్‌-బీ, సీ, డీలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది ఆఫీస్‌ బిల్డింగ్‌ టవర్‌-ఏ. హెలిప్యాడ్‌తో కలిపి జీ ప్లస్‌ 20 అం తస్తుల్లో టవర్‌-ఏ నిర్మించారు. ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్లు ఉంటాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ క్యాబిన్లు, మల్టీపర్పస్‌ హాల్‌, హెలీప్యాడ్‌ టవర్‌-ఏలోనే ఉంటాయి. టవర్‌ -బీని జీ ప్లస్‌ 15గా నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్స్‌, డీజీపీ, సీఎస్‌ క్యాబిన్లు, డయల్‌-100 ఉంటాయి. టవర్‌-సీలో ఆడిటోరియం ఉంటాయి. టవర్‌-డీలో మీడియా సమావేశం నిర్వహణతోపాటు క్యాంటీన్‌, శిక్షణా గదులు, మంత్రుల క్యాబిన్లు, వార్‌ రూం ఉంటాయి. టవర్లలో ఒకదాని నుంచి మరోదానికి చేరుకునేందుకు వీలుగా స్కైవేలు నిర్మించారు.

*ముఖ్య విభాగాలన్నీ ఒకేచోట*
పోలీసుతో పాటు అగ్నిమాపక, రైల్వే, విమానాశ్రయ భద్రతా విభాగం, మిలటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, రెవెన్యూ వంటి కొన్ని ముఖ్య విభాగాలు ఇక్కడి నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాలు ఈ సెంటర్‌లోనే కొనసాగుతాయి. డీజీపీ కార్యాలయం ఇందులో ఉన్నా ప్రస్తుతం లక్డీకాపూల్‌లో కొనసాగుతున్న కార్యాలయం నుంచే ప్రధానంగా విధులు నిర్వహిస్తారు. వారంలో ఒకటి, రెండు రోజులు డీజీపీ ఇక్కడి నుంచి విధులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రతి సీసీ కెమెరా రికార్డింగ్‌ ట్విన్‌ టవర్స్‌కు అనుసంధానం కావడంతో ప్రతి ఒక్కరి కదలికల్ని అధికారులు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం సీసీ కెమెరాలతో మోస్ట్‌ వాంటెడ్‌, పాత నేరస్తులు, అనుమానితుల్ని గుర్తించి గస్తీ విధుల్లో ఉండే సిబ్బందికి సమాచారం అందించి అదుపులోకి తీసుకుంటారు.
*టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌*
కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌గా రూపుదిద్దుతున్నాం. జిల్లాల్లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో ఈ సెంటర్‌ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇది నెట్‌వర్క్‌ ఆఫ్‌ కమాండ్‌ సెంటర్స్‌గా మారుతుంది. ప్రభుత్వ సహకారం, ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఒక కెమెరా నుంచి వచ్చే ఫీడ్‌ను పోలీ్‌సతో పాటు ఆయా ప్రభుత్వ విభాగాలు ఉపయోగించుకునే వీలుంటుంది. తద్వారా అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు అన్ని విభాగాలు కలిసి పనిచేసేందుకు వీలు కలుగుతుంది.

About The Author