రెండు వేర్వేరు సంఘటన ల్లో 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్ట్

చిత్తూరు జిల్లా:కెవిబి పురం మండలం పరిధిలో రెండు సంఘటన ల్లో 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం, ఇద్దరు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా నేతృత్వంలో, ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలు మేరకు మంగళవారం రాత్రి కెవిబి పురం మండలం లోని రెండు ప్రాంతాలకు రెండు టీమ్ లను కూంబింగ్ నిమిత్తం పంపించారు. ఆర్ ఎస్ ఐ కె.సురేష్ బాబు, ఏ ఆర్ ఎస్ ఐ మహేష్ నాయుడు టీమ్ మండలం లోని వల్లూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. నారాయణ వనం లోని రిజర్వు ఫారెస్టు గరిగమిట్ట ప్రాంతంలో కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వల్లూరు కు చెందిన పొలయ్య (52) పట్టుబడగా, మిగిలిన వారు పారిపోయారు. ఈ ప్రాంతంలో16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సి ఐ సుబ్రహ్మణ్యం నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో సంఘటనలో ఆర్ ఎస్ ఐ విశ్వనాధ్ బృందం కలత్తూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో మైలు చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని  లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే దావల వెంకటయ్య అలియాస్ పొట్టోడు (37) పట్టు బడగా మిగిలిన వారు పారిపోయారు. పారిపోయిన వారిలో వల్లూరు కు చెందిన మురళి, వినయ్, ఉదయ్, పాతపాలెంకు చెందిన సుబ్బులు, చిరంజీవి, వెంకటయ్య ఉన్నట్లు పట్టుబడిన వ్యక్తి ద్వారా తెలిసిందని సి ఐ వెంకట్ రవి తెలిపారు. వీటికోసం గాలిస్తున్నారు. ఈ కేసును సిఐ వెంకట్ రవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడిన ఎర్ర చందనం విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లలో సిఐ లు సుబ్రహ్మణ్యం, చంద్ర శేఖర్, వెంకట్ రవి కీలకంగా వ్యవహరించారు.

About The Author