నల్లమలలో రిజర్వు ఫారెస్టు లో శాసనాలు!

ASI ఎపిగ్రఫీ (శాసన పరిశోధన) విభాగానికి చెందిన నిపుణుల సమాచారం ప్రకారం, నల్లమల ప్రాంతంలో కనుగొనబడిన అనేక శాసనాలు లిపిని విశ్లేషించారు. ఇవి ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. ఈ ప్రాంతపు పురావస్తు ప్రాధాన్యతను మరింత లోతుగా అన్వేషించేందుకు, 2026 జూన్లో ఒక ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వేను (ఫీల్డ్ సర్వే) నిర్వహించడానికి ASI ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
నల్లమల అడవుల్లో నివసించే స్థానిక చెంచు గిరిజనులు, మారుమూల ప్రాంతాలలో తాము కనుగొన్న శాసనాల చిత్రాలను పంచుకుంటూ పరిశోధకులకు చురుగ్గా సహకరిస్తున్నారు. ఇటీవల, వారు అంతకుముందు ఎక్కడా నమోదు కాని మూడు శాసనాల చిత్రాలను పరిశీలన కోసం ASI కి పంపారు. వీటిపై లోతైన అధ్యయనం చేసిన అనంతరం, ASI ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నం రెడ్డి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ శాసనాలలో ఒకటి 13వ శతాబ్దానికి చెందినదని, అది తొలి విజయనగర కాలానికి చెందిందని ఆయన తెలిపారు. తెలుగు లిపిలో ఉన్న ఈ శాసనంలో స్థానిక దైవం మల్లికార్జున దేవుని గురించి , పాలుట్ల గ్రామం గురించిన ప్రస్తావన ఉంది. మిగిలిన రెండు శాసనాలు కూడా విజయనగర కాలానికి చెందినవేనని, వాటిలో అధికారిక రాజముద్రలతో కూడిన తెలుగు అక్షరాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
యర్రగొండపాలెం పరిసర ప్రాంతాలలో మొత్తం 10 శాసనాల నకళ్లను (Copied) సేకరించారు. ఈ శాసనాలన్నీ కళ్యాణి చాళుక్యులు, పొత్తపి చోళులు, కాకతీయులు, విజయనగర రాజవంశాలకు చెందినవి. ఇవి కన్నడ, తెలుగు భాషలలో, క్రీ.శ 11వ శతాబ్దం నుండి క్రీ.శ 16వ శతాబ్దపు అక్షర లిపితో లిఖించబడి ఉన్నాయి.
