శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల, 2026 జూలై 17: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రమేష్, కమిషనర్ శ్రీ వినయ్ లు కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో శ్రీ శివరామ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుందర బట్టర్ తదితరులు పాల్గొన్నారు.
