నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల పట్ల యాత్రికులు అప్రమత్తంగా ఉంఉండాలి

తిరుపతి జూలై 29: తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ దర్శనం, వసతి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టికెట్లు తదితర సేవలను అధికారిక వెబ్‌సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచింది. అయితే భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా లింకులను రూపొందించి భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన “ttddevasthanam.online” వంటి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించడం జరిగింది.

ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయంతో ఇటువంటి మోసపూరిత వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింకులు మరియు ఇతర అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు .

ఇప్పటి వరకు తిరుమలలోని వివిధ గెస్ట్‌హౌస్‌లు, వసతి సదుపాయాల పేర్లతో రూపొందించిన 32 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి, సంబంధిత డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించడం జరిగింది.

అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త పేర్లు, కొత్త డొమైన్‌లతో నకిలీ వెబ్‌సైట్లను మళ్లీ సృష్టిస్తూ భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నందున, తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికుడు ఆన్‌లైన్ బుకింగ్‌ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ సూచనలు.

తిరుపతి జిల్లా పోలిసుల హెచ్చరిక..యాత్రికులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు.

దర్శనం, వసతి, సేవా టికెట్ల బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.

సోషల్ మీడియా, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయకూడదు. వాటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు చెల్లించవద్దు.

బుకింగ్‌కు ముందు వెబ్‌సైట్ URLను జాగ్రత్తగా పరిశీలించి, అది అధికారిక టీటీడీ వెబ్‌సైటేనా కాదా నిర్ధారించుకోవాలి.

తక్కువ ధరలో గదులు, వెంటనే దర్శనం, ప్రత్యేక దర్శనం లేదా సేవా టికెట్లు ఇప్పిస్తామని చెప్పే తెలియని వ్యక్తులు, ఏజెంట్లు లేదా వెబ్‌సైట్లను నమ్మవద్దు.

అనుమానాస్పద వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా సోషల్ మీడియా లింక్ కనిపించిన వెంటనే తిరుపతి జిల్లా పోలీసు శాఖ లేదా టీటీడీ విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించాలి.

సైబర్ మోసానికి గురైనట్లయితే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు సందేశం ఇస్తూ “తిరుమలకు విచ్చేసే ప్రతి భక్తుడి భద్రత, సౌకర్యం తిరుపతి జిల్లా పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లపై పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోంది. టీటీడీ విజిలెన్స్ విభాగంతో సమన్వయంతో నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ మోసాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 32 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగించడం జరిగింది.”

“భక్తులు కూడా అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. అధికారిక సమాచారం, అధికారిక టీటీడీ వెబ్‌సైట్, అధికారిక మొబైల్ యాప్‌ను మాత్రమే వినియోగించాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లింక్‌ను నమ్మి డబ్బులు చెల్లించవద్దు. తక్కువ ధర, అత్యవసర బుకింగ్, ప్రత్యేక దర్శనం వంటి ఆకర్షణీయమైన ఆఫర్లకు మోసపోవద్దు.”

“భక్తుల అప్రమత్తతే సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట. భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే వ్యక్తులు, నకిలీ వెబ్‌సైట్ల నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. భక్తులు ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలి.” అని అన్నారు.

About The Author