బడిలో భయం వద్దు.. అనురాగమే ముద్దు!

బడిలో భయం వద్దు.. అనురాగమే ముద్దు!
బాల్యం కాలంతో కరిగిపోదు; మన అంతశ్చేతనలో నిశ్శబ్ద నమూనాగా స్థిరపడుతుంది. ఎంత ఎదిగినా చాలా
మందిని కుదిపేసే అభద్రత, అకారణ భయాలు, అదుపుతప్పే భావోద్వేగాల వెనుక… చిన్ననాటి గాయాలు, చేదు అనుభవాల తాలూకు ‘ట్రామా’ నీడలా వెంటాడుతోందనే చేదు నిజం చాలామందికి అర్థం కాదు. అలాంటి సున్నితమైన పసితనానికి అక్షరాల వెలుగులు పంచాల్సిన బడి గదులు, నేడు భయాందోళనల నరకకూపాలుగా మారుతుండటం సభ్యసమాజానికే తీరని కళంకం. వైజాగ్ లోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ చేయలేదన్న భయంతో ఆరేళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ బలైపోయిన హృదయవిదారక ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. చదువంటే సహజ వికాసం అనే ప్రాథమిక సూత్రం కనుమరుగై, శిక్షల ద్వారా విధేయతను రుద్దే దండనా సంస్కృతి పసిప్రాణాలను బలితీసుకుంటోంది.
సీసీటీవీ దృశ్యాలు విప్పిన విషాద నిజాలు
ఈ ఘటన వెనుక పరిస్థితులను, సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తే ఎవరి హృదయమైనా ద్రవించిపోక మానదు. సుదీర్ఘ కుటుంబ ప్రయాణం ముగించుకుని తీవ్ర అలసటతో ఉన్న ఆ పసివాడి పరిస్థితిని, హోంవర్క్ సంగతిని పట్టించుకోకుండా బడికి పంపడం తల్లిదండ్రుల వైపు నిర్లక్ష్యమైతే… బడిలో ఎదురైన పరిణామాలు మరింత విచారకరం. తరగతి గదిలో మొదటి బెంచీలో కూర్చున్న ఆ పసివాడు తీవ్ర భయంతో వణికిపోతూ, చేతులు ఊపుతూ, హోంవర్క్ పుస్తకం పట్టుకుని టీచర్ వద్దకు వెళ్లే సమయానికే ఏడుస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్న పిల్లాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాల్సింది పోయి… టీచర్ డ్రెస్ను దురుసుగా లాగి, ఏడుస్తున్నాడనే కోపంతో చెంపపై కొట్టింది. ఆ దెబ్బకు, లోపలి భయానికి తాళలేక ఆ చిన్నారి సదరు టీచర్ ఒడిలోనే స్పృహతప్పి కుప్పకూలిపోయాడు..బహుశా తనూ చాలా మంది టీచర్లు మాదిరే ఊహించని ఉపద్రవం ఇది.
పసి మనస్సులపై భయపు నీడలు
ప్రాథమిక స్థాయిలోని చిన్నపిల్లల నాడీ వ్యవస్థ అత్యంత వేగంగా రూపుదిద్దుకునే దశలో ఉంటుంది. విపరీతమైన భయానికి లేదా దండనకు గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఒక్కసారిగా పోటెత్తుతాయి. ఇది రక్తపోటును అకస్మాత్తుగా పెంచి, శ్వాసనాళాలను సంకోచింపజేసి, గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ప్రయాణ అలసటతో ఉన్న ప్రణయ్ తేజ్, ఆ తరగతి గదిలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తీవ్ర భయాందోళనకు గురై ఈ విధమైన నాడీ సంబంధిత ఆఘాతంతోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. హోంవర్క్ అనే కాగితాల భారం కంటే, అది పూర్తిచేయకపోతే పడే దెబ్బల భయం..మిగతా పిల్లలతో అజ్ఞానపు పోలిక ఆ పసిగుండెను నిర్దిష్టంగా ఆపేసింది.
రక్తసిక్తమవుతున్న తరగతి గదులు
విశాఖ ఘటన ఒకే ఒక్కటి కాదు; దేశవ్యాప్తంగా దండనా సంస్కృతి పసిమొగ్గలను ఎలా చిదిమేస్తోందో గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2010లో కలకత్తా లా మార్టినియర్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని ప్రిన్సిపాల్ బెత్తంతో కొట్టి అవమానించడంతో రౌవిత్ రంజన్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో హైదరాబాద్ మల్కాజ్గిరిలో హోంవర్క్ చేయలేదని ఐదో తరగతి విద్యార్థినిని ఎండలో గంటల తరబడి మోకాళ్లపై నిలబెట్టడంతో వడదెబ్బకు గురై ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అలాగే 2022లో రాజస్థాన్లోని జలోర్లో నీటి కుండను తాకాడని టీచర్ కొట్టడంతో తొమ్మిదేళ్ల ఇంద్ర మేఘ్వాల్ మెదడులో రక్తస్రావమై మరణించగా, అదే ఏడాది యూపీలోని ఔరయ్యాలో స్పెల్లింగ్ తప్పు రాశాడని పదో తరగతి విద్యార్థి నిఖిల్ దోహ్రే ఉపాధ్యాయుడు దాడితో మృత్యువాత పడ్డం ఆటవిక దండనా సంస్కృతి పరాకాష్టను తేటతెల్లం చేస్తున్నాయి.
చట్టాలు విస్తృతం… క్షేత్రస్థాయిలో శూన్యం
విద్యాహక్కు చట్టం-2009 (సెక్షన్ 17), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో పిల్లలను శారీరకంగా దండించడం, మానసికంగా వేధించడం చట్టరీత్యా నేరం. మొదటి తప్పునకు జరిమానా, పునరావృతమైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే వెసులుబాటు ఉన్నా క్షేత్రస్థాయి వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. దేశవ్యాప్త సర్వేల ప్రకారం 60 శాతానికి పైగా బడుల్లో విద్యార్థులు ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నారు. బాల్యంలో భౌతిక హింసను అనుభవించిన పిల్లల్లో 30 శాతానికి పైగా పెద్దయ్యాక తీవ్ర కుంగుబాటు, గుండె, నాడీ రుగ్మతల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫిర్యాదుల పెట్టెలు, కౌన్సిలింగ్ కేంద్రాలు 80 శాతం పాఠశాలల్లో నామమాత్రంగా కూడా అమలు కావడం లేదు.
అనురాగమే బోధనకు పునాది కావాలి
ప్రైవేటు స్కూల్లో సీసీటీవీ ఉంది కాబట్టే ఈ దృశ్యాలు బయటపడ్డాయి. మరి కనీస నిఘా లేని మన ప్రభుత్వ బడుల సంగతేమిటి? అక్కడ ఎన్ని నిశ్శబ్ద రోదనలు అణగిపోతున్నాయి? చిన్నారి మృతి చెందాడు కాబట్టి ఇది సంచలనమైంది; కానీ రోజూ దండనలకు గురవుతూ బతికుండగానే జీవశ్చవాలు అవుతున్న చిన్నారుల మానసిక వేదన మాటేమిటి?
పాఠశాల అంటే కుతూహలాన్ని ఆవిష్కరించే వేదిక కావాలి తప్ప భయపెట్టే బందిఖానా కారాదు. ఆటల ద్వారా నేర్చుకునే విద్యావిధానం అమలు కావాలి. ఉపాధ్యాయ నియామకాల్లో సబ్జెక్టుతో పాటు బాలల మనస్తత్వ శాస్త్రం, కోప నియంత్రణలో శిక్షణ తప్పనిసరి చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయుల గుర్తింపును రద్దు చేయడంతో పాటు, పర్యవేక్షణ లోపించిన యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకునే బాధ్యతను తల్లిదండ్రులూ అలవర్చుకోవాలి. శిక్షలతో విధేయతను రాబట్టే పద్ధతిని విడనాడి, అనురాగంతో విద్యాబుద్ధులు నేర్పే సంస్కృతిని నిర్మించుకోవడమే ప్రణయ్ తేజ్ వంటి చిన్నారుల విషాద ఉదంతాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
