లాక్‌డౌన్‌ పొడిగింపు సమష్టి నిర్ణయం: కిషన్‌రెడ్డి


దిల్లీ: ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రాలతో కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలు, కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను విభజించినట్లు చెప్పారు.
‘‘రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయి. కంటైన్‌మెంట్‌ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశాం. కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2.52 లక్షల పడకలు, 27వేల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. 2.22లక్షల పీపీఈ కిట్లను సేకరించాలని నిర్ణయించాం. 30కోట్ల హైడ్రాక్సీ క్లరోక్విన్‌ మాత్రలు సిద్ధం చేస్తున్నాం. వలసకార్మికుల కోసం నిన్న ఒక్క రోజే ఆరు రైళ్లు నడిపాం. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలిస్తాం. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులే గుర్తిస్తారు. వలస కార్మికులను తరలించేందుకు ఇవాళ్టి నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతాం. వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి. ఎవరూ రైల్వే స్టేషన్‌లోకి రావొద్దు.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే రావాలి. రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం. దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్‌ ధర నిర్ణయించాం. టిక్కెట్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలి. గడిచిన 24 గంటల్లో  దేశంలో 2,290 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

*కార్మికులు నేరుగా రైల్వే స్టేషన్‌కు రావొద్దు.*

వలస కార్మికులు ఎవరూ కూడా రైల్వేస్టేషన్ లోకి రావద్దని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే రావాలని కిషన్ రెడ్డి తెలిపారు. వలసకూలీల కోసం నిన్న ఒక్కరోజే 6 రైళ్లు నడిపామమని కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతామన్నారు. ఎక్కడ ఎవరున్నారో గుర్తించి వారిని స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వలసకులీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులనే తరలిస్తామన్న ఆయన దూరంతో సంబంధం లేకుడా రూ.50 టికెట్ ధర నిర్ణయించామని వెల్లడించారు. టికెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలని ఆదేశించారు. స్వస్థలాలకు వెళ్లే వలసకూలీలు కలెక్టర్లు, తహసీల్దార్లను సంప్రదించి వారికి సహకరించాలని కోరారు. వలస కార్మికులు ఉన్నచోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

About The Author