20 లక్షల వ్యాక్సిన్‌ డోసులు రెడీ: ట్రంప్

వాషింగ్టన్‌:అమెరికా ఇప్పటికే రెండు మిలియన్‌ డోసుల కరోనా వైరస్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయితే..  వీటి సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. 

‘నిన్న వ్యాక్సిన్‌ అభివృద్ధికి సంబంధించిన సమావేశం జరిగింది. ఆ విషయంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. రక్షణపరమైన తనిఖీలు పూర్తయితే, వాటి సరఫరాకు సిద్ధంగా ఉన్నాం’ అని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ వెల్లడించారు. అలాగే చికిత్సా విధానంలో కూడా మంచి పనితీరును కనబర్చుతున్నామని తెలిపారు. ఇటీవల ఇదే విషయంపై వైట్‌హౌస్‌ హెల్త్ అడ్వైజర్ ఆంథోని ఫౌచి మాట్లాడుతూ..2021 ప్రారంభానికి కొన్ని మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు అమెరికా వద్ద ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ఐదు కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం ఎంపిక చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.  ఇదిలా ఉండగా.. అధికారులు వైరస్‌ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. కానీ, మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం వైరస్‌కు సంబంధించిన కీలక విషయాలు ఇంకా తెలుసుకోలేదని చెప్పడం గమనార్హం. జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..అమెరికాలో ఇప్పటి వరకు 18లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 1,08,120 మంది మరణించారు

About The Author