చనిపోతున్నాను నన్ను క్షమించండి


ఫోన్‌ చేసి మాట్లాడుతూనే ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మధిర రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాత కొత్తగూడేనికి చెందిన అన్నపూర్ణమ్మ, మాధవాచారి దంపతులకు అనిల్‌ (25), వినయ్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్‌కుమార్‌కు వివాహం కాగా, మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో కొంతకాలంగా మనస్తాపానికి గురైన అనిల్‌ మధిరలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి శనివారం ఉదయం ఇంటినుంచి బయటకు వచ్చాడు. సాయంత్రం సమయంలో మధిరలోని వైరా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో కొంతసేపు తిరిగి సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వేట్రాక్‌పైకి వచ్చి అతడి బాబాయి లక్ష్మీనారాయణకు ఫోన్‌చేశాడు. మధిర రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉన్నానని, ‘చనిపోతున్నాను నన్ను క్షమించండి’ అంటూ కాల్‌లో చెప్పాడు. అనిల్‌ మాట్లాడుతుండగానే పెద్ద శబ్ధం వినిపించిందని లక్ష్మీనారాయణ రోదిస్తూ వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం పాతకొత్తగూడెంలో అనిల్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

About The Author