రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి


విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారాయన. ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 8 శాతం కేటాయిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖకు 27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే చదువు రాదనే అనుమానం గతంలో ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషితో ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో 18 వందలకుపైగా విద్యార్థులు చేరారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల గేట్లకు అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారాయన. మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులే రేపటి రోజున నాయకత్వం వహిస్తారని ఆకాంక్షించారు. తనతో పాటు వేదికపై ఉన్న వాళ్లందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారే అని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి.విధ్వంసం నుంచి వికాసం వైపు విద్యను తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో వారి మధ్య కులం అనే గోడలను నిర్మించారని విమర్శించారు. కుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినట్లు వివరించారు.140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేక పోతున్నామన్నామని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ కొరియా దేశం తెలంగాణ కంటే చిన్నదని కానీ… వారు 32 గోల్డ్ మెడళ్లు సాధించారన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన పతకాలెన్ని అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని తిరగరాయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడాకారులకు స్పూర్తి నివ్వాలని ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్‌కి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని సైతం రాజకీయం చేసే కుసంస్కారులు ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన ఆక్షేపించారు. గురుకులాల్లో ఉండే విద్యార్థులను ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌ బాల్ ఆడించానని… అది వారికి మధుర జ్ఞాపకంగా నిలిచిపోదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.

About The Author