శరీరమంతా జీడిరసం, కారంపోసి చిత్రహింసలు..

మహిళను వివస్త్రగా మార్చి.. శరీరమంతా జీడిరసం, కారంపోసి చిత్రహింసలు.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే..
అది ఊరి పొలిమేర.. చీకటి ముసుగులో సాగిన ఆ పంచాయితీ ఒక నరకం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న కొంతమంది రాక్షసులు.. సాటి మనిషి ప్రాణాలను, పరువును బజారుకీడ్చారు. వివాహేతర సంబంధమనే అపవాదు మోపి, ఒక మహిళపై సాగించిన ఈ పైశాచిక కాండ సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. శరీరంపై కారం చల్లి, జీడిరసంతో వికృతానందం పొందిన ఈ ఉదంతం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆ పొలిమేరలో ఏం జరిగింది..?
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ శివారులోని ఊరి పొలిమేరలు ఆ రాత్రి మూగ సాక్ష్యంగా నిలిచాయి. గ్రామానికి చెందిన ఒక మహిళపై వివాహేతర సంబంధంందనే అనుమానం మోపిన స్థానిక కులపెద్దలు.. రచ్చబండ పేరుతో పంచాయితీ పెట్టారు. బాధితురాలిని అక్కడికి బలవంతంగా లాక్కొచ్చారు. చట్టం ముందు నిలబెట్టాల్సిన మనుషులు.. తామే న్యాయమూర్తులమంటూ తెగింపునకు దిగారు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఆ మహిళను వివస్త్రను చేశారు. ఆమె పడుతున్న వేదనను చూసి కరగాల్సిన ఆ మృగాళ్ల మనసులు మరింత కఠినమయ్యాయి.
కారం, జీడిరసంతో రాక్షస క్రీడ..
వివస్త్రగా ఉన్న ఆ మహిళను మధ్యలో కూర్చోబెట్టి.. కులపెద్దల కనుసన్నల్లోనే కొందరు సాటి మహిళలతో ఈ అమానుషానికి పాల్పడ్డారు. ఆమె శరీరంపై కారాన్ని పోశారు. అంతటితో ఆగకుండా మంట పుట్టించే జీడిరసాన్ని ఆమె ఒంటిపై పూసి పైశాచిక ఆనందం పొందారు. తీవ్రమైన మంటతో, భరించరాని నొప్పితో బాధితురాలు గొంతుచించుకుని కేకలు వేస్తున్నా.. ఆ రాక్షసుల గుండెల్లో కనికరం కలగలేదు. ఆమె ఆర్తనాదాలు ఆ చీకటి పొలిమేరల్లోనే కలిసిపోయాయి. ఒక మహిళపై మరో మహిళ చేతనే ఈ అఘాయిత్యానికి పాల్పడటం ఆ ప్రాంతంలో మరింత దిగ్భ్రాంతిని కలిగించింది.
నిప్పులు చెరుగుతున్న స్థానికులు..
గ్రామ పొలిమెరలో జరిగిన ఈ దారుణ ఘటనపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరువు తీసే హక్కు ఈ సమాజానికి ఎవరిచ్చారు? కులపెద్దల ముసుగులో సాగిన ఈ అరాచకంపై పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బాధితురాలికి జరిగిన అన్యాయంపై ఎవరూ ముందుకు రాకపోయినా, ఈ దారుణంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఆ నిందితులను కటకటాల వెనక్కి నెట్టాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
