అమరావతి ఓటింగ్‌ సరళిపై ఎవరి ధీమా వారిది…

*సానుకూల ఓట్లేనని తెదేపా, ప్రభుత్వ వ్యతిరేకతేనని వైకాపా ..!*

పోలింగ్ శాతం 80 శాతానికి చేరటం తమకే అనుకూలమని అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత అయిదేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందువల్లే మరోసారి అండగా నిలిచేందుకు ఓటు వేయటానికి ముందుకు వచ్చారని తెదేపా అంచనా వేస్తోంది. పసుపు-కుంకుమ అమలుతో మహిళలు, పింఛన్ మొత్తం పెంపుపై వృద్ధులు సంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అమరావతిలో పురోభివృద్ధి, పోలవరం పనుల్లో పురోగతి వంటివన్నీ తమకు అనుకూలాంశాలని లెక్కలు వేసుకుంటోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో, ఈవీఎంల నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం చెందినప్పటికీ ప్రజలు ముందుకు వచ్చి ఓటేయడం తమకు లాభించే అంశమని ఆ పార్టీ భావిస్తోంది.

గత ఐదేళ్ల పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు ఇప్పుడు నమోదైన పోలింగ్ శాతం నిదర్శనమని వైకాపా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గేలా తెదేపా ప్రయత్నించిందని, చివరకు పోలింగ్ శాతం 80శాతానికి చేరడం ఖచ్చితంగా తమకు లాభించే అంశమేనని ధీమా వ్యక్తం చేస్తోంది.

*తెదేపా అంచనాలు..*

*పోలింగ్ శాతం పెరగడం..*

*మహిళలు..వయోవృద్ధులు అధికంగా ఓటింగ్ లో పాల్గొనడం..*

*ఎన్నికల ప్రచారంలో .. ‘నన్నే అభ్యర్థిగా భావించి ఓట్లేయండి’ అంటూ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం..*

*వైకాపా అంచనాలు..*

*80 శాతంపైగా పోలింగ్ నమోదవడం… ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం..*

*జగన్ పాదయాత్రతో ప్రజలకు చేరువ కావడం..*

*ప్రత్యేకహోదా విషయంపై మొదటి నుంచీ ఒకే స్టాండ్ పై ఉండడం…*

About The Author