తెలంగాణ రాష్ట్రం ఐదు వ వసంతాలు శుభాకాంక్షలు తెలిపారు

ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఉత్సాహ పూరిత వాతావరణంలో ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యావత్ ప్రజానీకానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని, అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన తొలి ఐదు సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలలో విస్తృతంగా భాగస్వాములు కావాలని ప్రజలకు సిఎం పిలుపునిచ్చారు. సంఘటిత శక్తిని ప్రదర్శించి, ఫలితాలు సాధించుకున్న స్వీయానుభవం కలిగిన తెలంగాణ సమాజం, అదే స్ఫూర్తితో నిర్ధేశిత లక్ష్యాలను సాధించగలుగుతుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు సిఎం కేసీఆర్ హృదయ పూర్వక నివాళులు అర్పించారు.

About The Author