టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్‌

72 గంటల్లో 5 లక్షల డౌన్‌లోడ్లు: రూపకర్తలు

బెంగళూరు: గల్వాన్‌ ఘటనతో చైనా వస్తువుల బహిష్కరణతో పాటు ఆ దేశ సామాజిక మాధ్యమాలను కూడా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చింగారీ యాప్‌కు భలే ప్రాచుర్యం లభించింది. 72 గంటల్లోనే సుమారు ఐదు లక్షల మంది భారతీయులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు దాని సృష్టికర్తలు బిస్వాత్మా‌, సిద్ధార్థ్‌లు సోమవారం వెల్లడించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం తమ యాప్‌ ట్రెండింగ్‌లో ఉందన్నారు. తాము ఊహించిన దానికన్నా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు.

జూన్‌ 15న గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దుర్గఘటనలో తెలుగు యోధుడు కర్నల్‌ సంతోష్‌బాబు కూడా వీరమరణం పొందారు. దీంతో అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా అనేక మంది చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు. పలువురు వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా వాటిని విక్రయించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రభావం చైనాకు సంబంధించిన సామాజిక మాధ్యమాలపైనా పడింది. దీంతో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన చింగారీకి విశేష స్పందన లభించింది. జూన్‌ 10 నాటికి ఈ యాప్‌ను లక్షమందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అదే రోజు చింగారీ రూపకర్తలు వెల్లడించారు. ఇప్పుడా సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. అలాగే ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలకు వీక్షకుల సంఖ్య ఆధారంగా పాయింట్లు కేటాయించి, అందుకు అనుగుణంగా డబ్బు సంపాదించొచ్చని స్పష్ట చేశారు.

About The Author