తిరుమలలో 5నుంచి వైకుంఠద్వార దర్శనం…


*తిరుమల:* వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 5వ తేదీ నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేయించనున్నట్లు చెప్పారు. నడక దారిలోని గోపురాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తిరుమలకు 100 నుంచి 150 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలని మండలి సమావేశంలో తీర్మానించామన్నారు. అనాథ పిల్లల కోసం తితిదే నిర్వహిస్తున్న బాలమందిరంలో రూ.10 కోట్లతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

*దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం..*
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామన్నారు. తితిదే ఆస్తులకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసి, పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

About The Author