డ్రగ్స్పై దండయాత్ర 2.0”లో భాగంగా బయోచెక్ టెస్టింగ్ కిట్లతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.
తిరుపతి 09: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు., ఐపీఎస్., గారి ఆదేశాలు, అడిషనల్ ఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడి సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక నిఘా, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో *“డ్రగ్స్పై దండయాత్ర 2.0”* కార్యక్రమాన్ని రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్రంరెడ్డిపాలెం గ్రామ సమీపంలో నిర్వహించారు.
– ప్రత్యేక నిఘా – శాస్త్రీయ గుర్తింపు.
గంజాయి విక్రయాలు, రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా నమోదైన వ్యక్తులు, గంజాయి విక్రేతలు (పెడ్లర్లు), వినియోగదారుల వివరాలను సేకరించి వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని,బయోచెక్ పరీక్షల ద్వారా గంజాయి వినియోగదారులను శాస్త్రీయంగా గుర్తించి, వారి ద్వారా గంజాయి సరఫరా వ్యవస్థకు సంబంధించిన ఫార్వర్డ్ మరియు బ్యాక్వర్డ్ లింకులను వెలికితీస్తున్నామని, ఈ ప్రక్రియ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిర్వాహకులు, మధ్యవర్తులు, విక్రేతలు మరియు ఇతర నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతను కాపాడటమే లక్ష్యంగా
గంజాయి విక్రేతలే కాకుండా గంజాయి వినియోగదారులను కూడా గుర్తించి వారిని వ్యసన విముక్తులుగా మార్చడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. యువతను శిక్షించడం కాదు, వారి జీవితాలను కాపాడటమే మా ఉద్దేశ్యం అన్నారు.
గంజాయికి బానిసలైన యువతకు వారి తల్లిదండ్రుల సమ్మతితో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, పాపానాయుడుపేటలోని RASS పునరావాస కేంద్రం, స్విమ్స్ మరియు రుయా ఆసుపత్రి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, పునరావాసం కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్.,గారు సందేశం ఇస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం చట్టపరమైన చర్య కాదు అది యువత భవిష్యత్తును రక్షించే సామాజిక ఉద్యమం. జిల్లా వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రతి యువకుడు వ్యసనాల నుంచి దూరంగా ఉండి విద్య, ఉపాధి, కుటుంబ విలువల పట్ల బాధ్యతతో ముందుకు సాగాలి. గంజాయి రహిత తిరుపతి జిల్లా నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు.
– ప్రజలకు విజ్ఞప్తి.
గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసుల అత్యవసర సేవలు: 112 | మహిళా హెల్ప్లైన్: 181 | సైబర్ మోసాల హెల్ప్లైన్: 1930 | సైబర్ క్రైమ్ పోర్టల్: www.cybercrime.gov.in (112) తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.కార్యక్రమంలో గాజులమాండ్యం సీఐ శ్రీ ఎం. మంజునాథ రెడ్డి, ఎస్ఐ శ్రీ ఎస్. హరీష్ మరియు పోలీస్ మరియు ఈగల్ సిబ్బంది పాల్గొని గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు ఆధునిక బయోచెక్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.
