సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

తిరుపతి,2026 జులై09: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విద్యార్థులు, యువత మరియు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సమాజంలో నేరాల నివారణతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు.

ఈ సందర్భంగా పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కంభాలగుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలను సందర్శించి విద్యార్థినులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, గంజాయి దుష్ప్రభావాలు, “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి అవగాహన కల్పించి, విద్యార్థుల సమస్యలను తెలుసుకుని సూచనలు చేశారు.

అలాగే శ్రీహరికోట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి జడ్.పి.హెచ్. పాఠశాల, షార్‌ను సందర్శించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ భద్రత, మహిళలపై నేరాలు, సోషల్ మీడియా ప్రభావం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పోక్సో చట్టం, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేసే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.

పోలీస్ అధికారులు మాట్లాడుతూ, తెలియని వ్యక్తుల లింకులు, ఓటీపీలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. మాదకద్రవ్యాలు విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.

జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, మహిళల సహాయం కోసం 181, సైబర్ మోసాల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు.

About The Author